మెదక్ మున్సిపాలిటీ/సిద్ధిపేట అర్బన్, జూలై 16: పాలిసెట్ 2021 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా సమన్వయకర్త సువర్ణ శుక్రవారం విలేకరులకు తెలిపారు. కొవిడ్-19 నిబంధనల మేరకు పరీక్ష నిర్వహణకు సంబంధించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఏడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొత్తం 1,954 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. సిద్ధిపేట మండలంలో పాలిసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సిద్దిపేట పాలిసెట్ కోఆర్డినేటర్ సూర్యనారాయణ తెలిపారు. పరీక్ష కోసం సిద్దిపేట పట్టణంలో 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 2,818 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారన్నారు. సంగారెడ్డిలో 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులను గంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని, 11 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అన్నారు. విద్యార్థులు తమ హాల్టికెట్లు, హెచ్బీ పెన్సిల్, బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ , మాస్క్, శానిటైజర్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. హాల్టికెట్ను http://polycetts.nic.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.