గజ్వేల్, జూలై19: పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన గజ్వేల్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే దేశంలోని పెట్రో సంస్థలకు ఇష్టారీతిగా పెట్రోధరలను పెంచుకునే అధికారాన్ని కల్పించిందని, ఇప్పుడేదో టీఆర్ఎస్ పార్టీయే రాష్ట్రంలో ధరలు పెంచుతుందని మాట్లాడడం అవివేకమన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగలేదని చెప్పేటోళ్లకు గజ్వేల్లో, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కనిపిస్తలేదా అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన నాటి నుంచి గజ్వేల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఎడ్యుకేషన్ హబ్లు, మైనార్టీ గురుకులాలు, అధునాతన ప్రభుత్వ కార్యాలయ భవనాలు, విశాలమైన రహదారులు, ఆర్అండ్ఆర్ కాలనీ, డబుల్ బెడ్రూం ఇండ్లు, కాళేశ్వరం సాగునీటి కాలువలు ఇవన్నీ కాంగ్రెస్ నాయకులకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఆరు ఏండ్లలోనే 50ఏండ్లకు మించిన అభివృద్ధిని గజ్వేల్లో చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బబ్బూరి రజిత, బాలమణి, ఆత్మ కమిటీ చైర్మన్ చిన్నమల్లయ్య, ఏఎంసీ డైరెక్టర్ మతిన్, నాయకులు నవాజ్మీరా తదితరులు పాల్గొన్నారు.