మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 13: టీఎస్బీపాస్ ద్వారా ఇక నుంచి 75 గజాల స్థలానికి సులువుగా భవన నిర్మాణ అనుమతులు పొందవచ్చు. అనుమతుల కోసం దరఖాస్తు చేస్తే అత్యధికంగా రిజెక్ట్ అవుతుండటంతో ఇక మీదట చిన్న ప్లాట్లకు సైతం సులభంగా అనుమతులు పొందే అవకాశాన్ని సీడీఎంఏ కల్పించింది. ఈనెల 4వ తేదీన సంబంధిత జీవోను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ జారీ చేశారు. ఇప్పటి వరకు 75 చదరపు గజాలు (63 చ.మీ) గల ప్లాట్ల యజమానులు భవన నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే ఎల్ఆర్ఎస్, మార్టిగేజ్, ప్లాన్ వంటివి జత చేయాల్సి ఉండేది. తాతల నాటి పాత ఇండ్లు, ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా వారసత్వంగా వచ్చిన ఇండ్లకు ఇవన్నీ అడగటం దరఖాస్తు చేసుకుంటే తిరస్కరణకు గురవుతున్నాయి. ఇలా తిరస్కరణకు గురవుతుండటంతో ఇబ్బందుల పాలవుతున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో పాలకవర్గాల దృష్టికి భవన నిర్మాణ యజమానులు ఈ విషయం తీసుకెళ్లినా ఫలితం ఉండటం లేదు. టీఎస్ బీపాస్లో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయా మున్సిపల్ చైర్మన్లు, సీడీఎంకు, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. స్పందించిన కేటీఆర్ ఈ విషయం సత్వరమే భవన నిర్మాణ యజమానులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీఎస్బీపాస్లో సవరణలు చేస్తున్నట్లు ప్రకటించారు. 75 గజాల లోపు స్థలం ఉండి జీ+1 భవన అనుమతి కోసం ఆక్యూపెన్సీ సర్టిఫికెట్, ఎల్ఆర్ఎస్, మార్టిగేజ్ వంటివి ఎలాంటి అనుమతులు అవసరం లేదని, కేవలం రూపాయికే అనుమతులు ఇవ్వనున్నారు. ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడంతో పేదలతో పాటు పాత ఇండ్లు, వారసత్వంగా వచ్చిన ఇండ్లకు ఎంతో మేలు జరుగనున్నది.
అందరికీ ఉపయోగం..
వారసత్వంగా వచ్చిన పురాతన ఇంటి స్థలాల్లో 75 గజాల స్థలంలో భవన నిర్మాణానికి ఎల్ఎర్ఎస్, మార్టిగేజ్ వంటివి ఇక అవసరం లేదు. ప్రభుత్వం ఇటీవలే టీఎస్బీపాస్లో సవరణలు చేయబడింది. వారసత్వంగా వచ్చిన స్థలాల్లో సులువుగా అనుమతులు పొంది భవ నిర్మాణాలు చేసుకోవచ్చు.