మర్కూక్, జూలై 19 : తెలంగాణ వ్యాప్తంగా సాగునీటి వనరులు పెరగడంతో భూమి విలువ అమాంతం పెరిగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం త్వరలో భూమి విలువలను రెట్టింపు చేయడంతో రిజిస్ట్రేషన్ల చార్జీలను పెంచే అవకాశం ఉండటంతో రైతులు, రియల్టర్లు రిజిస్ట్రేషన్లను ప్రక్రియను వేగవంతం చేశారు. ఏ క్షణానైనా రిజిస్ట్రేషన్లు పెంచే అవకాశం ఉంది. భూమి విలువలు ప్రభుత్వం పెంచడం ద్వారా రైతులకు, సాధారణ ప్రజలకు లాభం చేకూరనున్నది. త్రిబుల్ ఆర్ వస్తున్న నేపథ్యంలో, మండలంలో కొండపోచమ్మ రిజార్వాయర్ ఉండడంతో భూమి విలువలు పెరిగే అవకాశం ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని గరిష్ఠ సంఖ్యలో స్లాట్ బుకింగ్ చేసుకుంటున్నారు.
ధరణితో మారిన పేదల జీవితాలు
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి రిజిస్ట్రేషన్తో పేదల జీవితాలు మారుతున్నాయి. సీఎం రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ధరణికి శ్రీకారం చుట్టారు. గతేడాది నవంబర్ 2న నూతన రెవన్యూ చట్టం ప్రకారం ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నాటి నుంచి అక్రమ భూబదలాయింపు కట్టడి చేశా రు. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం జరిగింది. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లు రెండు ఒకేసారి కావడంతో రైతులకు కష్టాలు తప్పినయి. గతంలో భూముల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వెళ్లేది. అక్కడ పని పూర్తి కావాలంటే ఎకరానికి రూ.10 వేలు ఖర్చయ్యేది. కానీ పని అయ్యేది కానిది నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడు ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయానికంటే ముందు అవుతున్నది. రెండుమూడు రోజుల్లో రిజిస్ట్రేషన్ల ధరలు పెరుగుతున్నాయనే సమాచారంతో రైతులు ధరణి పోర్టల్లో స్లాట్ బుకింగ్ చేసుకుంటున్నారు.
రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి..
ధరణి పోర్టల్లో రోజురోజుకూ రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. రూపాయి ఖర్చులేకుండా భూముల రిజిస్ట్రేషన్లు ధరణి ద్వారా జరుగుతున్నాయి. మండలంలో చాలా మంది రైతులు వారికి చెందిన భూములను వారి పిల్లల పేరుమీద గిప్టు రిజిస్ట్రేషన్లు చేసేందుకు ముందుకు వస్తున్నారు. రిజిస్ట్రేషన్ల ధరలు పెరుగుతున్నాయనే సమాచారంతో రైతులు వారి కుమారులు, కూతుర్ల పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. – మర్కూక్ సబ్రిజిస్ట్ట్రార్ ఆరిఫా