ఝరాసంగం, జూలై 22 : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బర్ధీపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో గురుపౌర్ణమి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆశ్రమ పీఠాధిపతి అవధూతగిరి మహారాజ్ వైరాగ్య శిఖమణి తెలిపారు. ఈ నెల 24న ప్రారంభమయ్యే ఉత్సవాలు బర్ధీపూర్ గ్రామం నుంచి ఆశ్రమం వరకు భక్తులతో ఊరేగింపు ఉంటుందన్నారు. ఉదయం 4 గంటలకు సుప్రభాతం, 5 గంటలకు ప్రాతఃస్మరణ స్తోత్రం, 5:30గంటలకు ప్రభాత్పేరి, 6గంటలకు రుద్రాసాహిత దత్తాత్రేయ అభిషేకం, 8 గంటలకు సామూహిక అనఘాదేవి వ్రతం, యజ్ఞం, 11 గంటలకు రథోత్సవం, పూర్ణాహుతి, తులాభారం, ప్రవచనాలు, గురుపాద పూజోత్సవం, ప్రసాద వితరణ ఉంటుందన్నారు. గురువారం ఆశ్రమంలో పీఠాధిపతి మాట్లాడుతూ.. గురుపౌర్ణమి ఉత్సవాలను భక్తుల సమక్షంలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. భక్తులు భజనలను చేస్తూ ఆశ్రమం వరకు ఊరేగింపు నిర్వహి స్తామన్నారు. కొవిడ్ నిబంధలను దృష్టిలో పెట్టుకుని గురుపౌర్ణమికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. భక్తులు గురువులను రథంపై కూర్చోపెట్టి ఊరేగింపు నిర్వహిస్తారన్నారు. ఆశ్రమం లో గురువులకు పాదపూజ చేసి ఆశీర్వచనాలు తీసుకుంటారన్నారు.