నారాయణఖేడ్, జూలై 18 : నారాయణఖేడ్ పట్టణంలోని రామాలయం, కాశీ విశ్వనాథస్వామి ఆలయాల నిర్వహణ మొదలుకొని ఆలయ భూ ముల వ్యవహారం వరకు అస్తవ్యస్తంగా మారింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సంబంధిత అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపిన ఫలితంగా రామాలయాన్ని దేవాదాయశాఖ ఆధీనంలోకి తీసుకుని, 2018లో ఆలయ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా, ఇటీవలే రెండోసారి ఆల య కమిటీ కొలువుదీరింది. పట్టణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయా ఆలయాలను అభివృద్ధి చేసేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసిన ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, రామాలయం విషయంలో 70 ఏండ్ల గుత్తాధిపత్యానికి చెక్ పెట్టారని చెప్పవచ్చు. అంతేకాదు పట్టణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక రామాలయాన్ని భవ్యమైన రీతిలో పునఃనిర్మించేందుకు రూ.2కోట్ల నిధులు మంజూ రు చేయించారు.
ప్రక్షాళన ప్రారంభమైందిలా…
శతాబ్దాల చరిత్ర కలిగిన నారాయణఖేడ్ రామాలయం ఒకప్పుడు భక్తుల కొంగు బంగారంగా విలసిల్లింది. రానురాను నిత్యపూజలు మినహా ఏ ఉత్సవమైనా సాదాసీదాగా నిర్వహించే స్థితికి చేరింది. రామాలయాన్ని అభివృద్ధి చేయాలనే దృక్పథంతో కొంతమంది ధర్మకర్తలు, భక్తులు ఎమ్మెల్యే భూపాల్రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు. దీంతో ఎమ్మె ల్యే పట్టణంలోని రామాలయంతో పాటు ఇతర ఆలయాలను అభివృద్ధి విషయమై దేవాదాయశాఖ అధికారులతో పలుమార్లు చర్చించారు. దీంతో ఆయా ఆలయాలకు మోక్షం కల్పించే చర్యలకు బీజం పడ్డాయి. ప్రభుత్వ సహకారంతో అధికారుల కనుసన్నల్లోనే ఆలయాలను అన్నివిధాలా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే నిర్ణయించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు మూడేండ్ల క్రితం రామాలయాన్ని దేవాదాయశాఖ ఆధీనంలోకి తీసుకుని పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. తదనంతరం 41.29 ఎకరాల భూములపై దృష్టిసారించగా, ఆయా భూములు 70ఏండ్లుగా కేవలం కొంతమంది చేతుల్లోనే ఉండడం, నామమాత్రపు కౌలు చెల్లిస్తూ ఆలయ భూములను అనుభవిస్తున్నట్లు అధికారులు తేల్చారు. ఎమ్మెల్యే సూచన మేరకు చేసిన అనేక ప్రయత్నాల ఫలితంగా ఎట్టకేలకు ఆలయ భూములను స్వాధీనం చేసుకోవడంతో ప్రక్షాళన చర్యల్లోని తొలి అంకం ముగిసింది.
ఆదాయ మార్గాల వైపు దృష్టి..
ఆయా ఆలయాలు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ సహకారంతో పాటు ఆలయ ఆదాయాన్ని పెంచుకోవడం కూడా ముఖ్యమని భావించిన అధికారులు, ఆలయాల భూములను అధికారికంగా కౌలుకు ఇచ్చే చర్యలు చేపట్టారు. ఫలితంగా వేలం ద్వారా రామాలయానికి రూ.6.01లక్షల ఆదాయం సమకూరింది. స్వామివారి ఆలయానికి సంబంధించిన 15.10 ఎకరాల భూమిని రూ.లక్షకు వేలం పద్ధ్దతిన కౌలుకు కేటాయించారు. ఎమ్మెల్యే సహకారంతో అధికారులు తీసుకున్న ఈ చర్యలు ఆలయ అభివృద్ధికి నాంది పలకగా, నిబంధనలను గాలికొదిలి దశాబ్దాల తరబడి కొంతమం ది చేతుల్లోనే మగ్గుతున్న ఆలయ భూములకు మోక్షం లభించినైట్లెంది. అంతేకాదు పట్టణంలోని కరస్గుత్తి రోడ్డు ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న కాశీవిశ్వనాథసామి ఆలయ భూములను వినియోగంలోకి తెచ్చి, ఆలయ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునే దిశగా వ్యాపారులకు అద్దె ప్రాతిపదికన స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో దుకాణా స్థలాలను వేలం ద్వారా కేటాయించేందుకు అధికారులు ఏ ర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సా హం, ఎమ్మె ల్యే భూపాల్రెడ్డి సహకారంతో నారాయణఖేడ్ పట్టణంలోని అతి పురాతనమైన చారిత్రక ఆలయాలకు మంచి రోజులు వచ్చాయనేది సుస్పష్టం.
ఆలయాలను అభివృద్ధి చేసి తీరుతా..
ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆలయాలను అభివృద్ధి చేసి తీరుతాం. ప్రస్తుతం రామాలయం దీనావస్థకు చేరడానికి కాంగ్రెస్ నాయకులే కారణం. 70 ఏండ్లుగా ఆలయ భూములపై పెత్తనం చెలాయిస్తూ దాదాపు 42ఎకరాల భూములకు సంబంధించిన ఆదాయం ఆలయానికి చెందకుండా చేశారు. ఆలయాల దుస్థితిని తెలుసుకుని అభివృద్ధి చేద్దామనే సంకల్పంతో చర్యలు తీసుకుంటే అడుగడుగునా అడ్డుకుంటున్నారు. నేను పట్టుబట్టి తొలిసారి ఆలయ భూములకు వేలం నిర్వహించి కౌలుకు ఇవ్వడంతో ఆలయానికి పెద్దఎత్తున ఆదాయం సమకూరింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆశీస్సులతో రామాలయ పునఃనిర్మాణానికి రూ.2కోట్లు మంజూరు చేయించా. కాశీవిశ్వనాథస్వామి ఆలయ భూములను వినియోగంలోకి తెచ్చి ఆలయ ఆదాయాన్ని పెంచాలని ప్రయత్నిస్తుంటే బీజేపీ నాయకులు అడ్డుపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆలయాల అభివృద్ధి జరిగి తీరుతుంది.