పాపన్నపేట, జూలై 18 : ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఫలాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. వేద పండితులు అమ్మవారిని వివిధ రకాల పండ్లతో ప్రత్యేకంగా అలంకరించి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో సార శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్శన ఏర్పాట్లు చేశారు. వేదపండితులు శంకర్శర్మ, పార్థీవశర్మ, మురళీశర్మ, రాముశర్మ, రాజశేఖర్ అమ్మవారికి పూజలు నిర్వహించారు. పాపన్నపేట ఎస్సై సురేశ్ తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
వేంకటేశ్వర ఆలయంలో పూజలు
మండలంలోని మోతే గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకొని భక్తులు పూజలు నిర్వహించారు. భక్తులు సర్ప శాంతి సందర్భంగా నాగదేవత అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు పండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్మాణకర్త భాస్కర్రావు, భక్తులు పాల్గొన్నారు.
మల్లన్న సన్నిధిలో వీ ప్రకాశ్
మల్లికార్జున స్వామి వారిని తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ చైర్మన్ వీ ప్రకాశ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రాష్ట్ర చైర్మన్ ఆలయానికి రావడంతో ఆలయవర్గాలు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఆలయంలో చైర్మన్ ప్రత్యేక కుటుం బ సభ్యులతో కలిసి పూజలు చేశారు. ఆయన వెంట ఈవో బాలాజీ, ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఏఈవో వైరాగ్యం అంజయ్య, పర్యవేక్షకులు నీల శేఖర్, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ధర్మకర్తలు బొంగు నాగిరెడ్డి, పొతుగంటి కొమురవెల్లి ఉన్నారు.
మల్లన్న’ను దర్శించుకున్న భక్తులు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం మల్లన్న మమ్మేలు అంటూ మార్మోగింది. వివిధ ప్రాంతాలు నుంచి భక్తులు పెద్దసంఖ్యంలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు అభిషేకాలు, పట్నాలు, అర్చ న, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశ ఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు చెల్లించారు. మహిళలు కొండ పైన ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. మరికొందరు భక్తులు రాతి గీరల వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు చేశారు. భక్తులకు ఎలాం టి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.