సదాశివపేట, జూలై 25 : వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం, రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తూ అండగా ఉంటున్నది. ఎరువుల కోసం రైతులు ఎక్కడా ఇబ్బందిపడకుండా ఎప్పటికప్పుడు చర్య లు తీసుకుంటున్నది. గతేడాది నుంచి జిల్లా సహకార మా ర్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ద్వారా రైతులకు అందుబాటులో మార్కెట్లో కంటే తక్కువ ధరలకే ఎరువులు అందిస్తున్నది. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల ద్వారా మండల కేంద్రాలతోపాటు మేజర్ పంచాయతీల్లో ‘రైతు సేవా కేంద్రాలు’ ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల నుంచి అన్నదాతలు తమకు అవసరమైన ఎరువులు తీసుకునే వి ధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీటితోపాటు ని యోజకవర్గ కేంద్రాల్లో వెయ్యి టన్నుల సామర్థ్యంతో కూడిన ఎరువు విక్రయ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో..
ఉమ్మడి మెదక్ జిల్లాలో 100 వరకు రైతు సేవా కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా డీసీఎంస్ చర్యలు చేపట్టింది. రైతులు తమ పంటలు విత్తుకుని కలుపుతీసి ఎరువుల కోసం ఎదురుచూడకుండా, వారికి కావాల్సిన ఎరువులు వెంటనే తీసుకెళ్లేందుకు ప్రధాన పట్టణాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు 20 రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతులు తమ గ్రామాలకు కూడా కావాలనుకుంటే డీసీఎంఎస్కు సమాచారం అందిస్తే ఎలాంటి ట్రాన్స్పోర్టు కిరాయిలు లేకుండానే రైతు సేవా కేంద్రాల్లో లభించే ధరలకు నేరుగా అందించనున్నారు.
మార్కెట్లో కంటే తక్కువ ధరకు..
జిల్లా మార్కెటింగ్ సొసైటీల ద్వారా ఏర్పాటు చేస్తున్న రైతు సేవా కేంద్రాల ద్వారా బహిరంగ మార్కెట్లో కంటే తక్కువ ధరలకు ఎరువులు లభించనున్నాయి. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఇతర ఎరువులు ఎంఆర్పీకి లభిస్తుండగా, ఇతర ఫెస్టిసైడ్స్ రూ.50 నుంచి రూ.100 తక్కువకు ఈ కేంద్రాల్లో లభిస్తాయి. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో 105 ప్రాథమిక సహకార సంఘాలు(పీఏసీఎస్) ఉన్నాయి. గత వానకాలంలో సహకార సంఘాల ద్వారా కూడా ఎరువులు రైతులకు అందించారు. పలువురు రైతులు డీసీఎంఎస్కు డీడీ చెల్లిస్తే నేరుగా గ్రామాలకు ఎరువులు సరఫరా చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు అందుబాటులో ఉంటాయని గుర్తించారు. ఈ మేరకు మంత్రి హరీశ్రావు సూచనలతో డీసీఎంస్ చైర్మన్ శివకుమార్ మండల కేంద్రాల్లో రైతు సేవా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అన్నిచోట్ల ఈ కేంద్రాలు ఏర్పాటైతే రైతులకు డబ్బులు ఆదా కావడంతోపాటు సమ యం కలిసి వస్తుంది. ఇబ్బంది లేకుండా రైతులు నేరుగా వచ్చి ఎరువులు తీసుకెళ్లే అవకాశం లభించనున్నది.
నిరుద్యోగులకు అవకాశం..
రైతు సేవా కేంద్రాల ఏర్పాటుకు నిరుద్యోగులు, స్వయం సహాయక మహిళా సంఘాలు, యువజన సంఘాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన తర్వాత కేంద్రాలను మంజూరు చేయనున్నారు. కేంద్రం మంజూరైన వారికి కొంత మొత్తానికి సంబంధించిన ఎరువులు సరఫరా చేయనున్నారు. వాటిని అమ్మగా వచ్చిన దాంట్లో కొంత మొత్తాన్ని ఆదాయంగా ఇవ్వనున్నారు. ఈ కేంద్రాల ఏర్పాటుతో కొంతమంది యువతకు ఉపాధి లభించనున్నది. ఈ వానకాలంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో పలుచోట్ల స్వయం సహాయక మహిళా సంఘాల నుంచి కూడా ఎరువులు విక్రయించారు. పూర్తి స్థాయిలో రైతు సేవా కేంద్రాలు అందుబాటులోకి వస్తే చాలా వరకు ఇబ్బందులు తొలిగిపోనున్నాయి.
రైతులకు ఇబ్బంది లేకుండా సరఫరా..
రైతుల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు సరఫరా చేస్తున్నాం. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలతోపాటు మం డల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. సంగారెడ్డి, మెదక్, సిద్దపేట జిల్లాల పరిధిలో 100 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యం ఉంది. సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నది. రైతుబంధు, రైతుబీమా వంటి అద్భుత పథకాలు ప్రభుత్వం అమలు చేస్తున్నది. ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది. నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతున్నది. డీసీఎంఎస్ను బలోపేతం చేస్తున్నాం.