గర్మిళ్ల : తన భర్తను తనకు అప్పగించాలంటూ అత్తగారింటి ఎదుట ఓ మహిళ న్యాయ పోరాటం చేస్తున్న ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..సూర్యపేటకు చెందిన రుబీనా, మంచిర్యాలకు చెందిన వంశీకృష్ణ ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వరకట్నం కోసం తన భర్తకు మరో పెళ్లి చేయడానికి తన అత్తింటి వారు తన భర్తను ఎక్కడో దాచిపెట్టారని బాధితురాలు వాపోయింది. ఈ మేరకు తనను మోసం చేసి పారిపోయిన భర్తపై సూర్యపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేసినట్లు ఆమె తెలిపింది.
ప్రేమ వివాహం చేసుకుని జీవితాంతం నమ్మకంగా తోడు ఉంటాడని భావించి తన తల్లిదండ్రులను దూరం చేసుకున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అత్తింటి మాటలు విని తనే భర్త తనని ఒంటరి చేసి పారిపోయాడని, అతని ఆచూకి చెప్పాలని మంచిర్యాల జిల్లా కేంద్రం సప్తగిరి కాలనీలోని రోడ్ నెంబర్ 4 లో ఉన్న వంశీకృష్ణ తల్లిదండ్రుల ఇంటి ఎదుట బైఠాయించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి కావడంతో పట్టణ ఎస్సై దేవయ్య బాధితురాలికి నచ్చ జెప్పి జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రానికి తరలించారు.