శ్రీరాంపూర్ : సింగరేణి బొగ్గు బ్లాకులు ప్రైవేటీకరిస్తూ వేలం వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ఉపాధ్యక్షుడు మంద మల్లారెడ్డి పేర్కొన్నారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాకులు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని సింగరేణికి బొగ్గు బ్లాకులు ఆప్పగించాలని డిమాండ్ చేశారు. దేశంలో 88 బొగ్గు బ్లాక్లను బీజేపీ ప్రభుత్వం వేలంద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం అన్యాయమన్నారు. సింగరేణి సంస్థ గత నాలుగు సంవత్సరాలుగా సర్వేచేసి 66 కోట్లతో బొగ్గు అన్వేషణకు, అధ్యాయనానికి వెచ్చించి బొగ్గు నిల్వలు కనుగొనడం జరిగిందన్నారు. ఆబొగ్గు బ్లాకులను సింగరేణికి ఆప్పగించాలని ఎన్నోసార్లు యాజమాన్యం, తెలంగాణ ప్రభుత్వం కోరిందని పేర్కొన్నారు.
విజ్ఞప్తులను లెక్క చేయకుండా కేంద్రం మొండిగా వ్యవహరిస్తు ప్రైవేటీకరణకు పూనుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. సింగరేణిలోని బొగ్గు బ్లాకుల అన్వేషణకు సత్తుపల్లి బ్లాక్-3కి 8 కోట్లు, కోయగూడెం ఓసీ-3లో 18 కోట్లు, శ్రావణపల్లిలో 20కోట్లు, మంచిర్యాల మందమరి కేకే 6లో 20 కోట్లు ఖర్చు చేసిందన్నారు. వీటి నుంచి ఏడాదికి 12 మిలియన టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తుతుందని వెల్లడించారు. వెంటనే ఈ బ్లాకులను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాకులు సాధించుకోవడానికి తాము సీఎం కేసీఆర్ ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించుకుంటామన్నారు.