మంచిర్యాల : పారిశుధ్య కార్మికులతో పాటు ట్రాఫిక్ ఫోలీసులకు ఓ స్వచ్ఛంద సంస్థ ఆహారంతో పాటు మామిడిపండ్ల రసాన్ని అందజేసింది. మంచిర్యాలకు చెందిన సామాజిక్ జాగృతి చారిటబుల్ ట్రస్ట్ శుక్రవారం 90 మంది పారిశుధ్య కార్మికులు, ట్రాఫిక్ పోలీసులు బ్రేక్ఫాస్ట్ అందివ్వడంతో పాటు మ్యాంగో జ్యూస్ను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జి స్వరూప రాణి ట్రస్ట్ సభ్యులను అభినందించారు. పౌరులు వీరి నుండి ప్రేరణ పొంది దాతృత్వం చేపట్టాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. కొవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో పట్టణాన్ని శుభ్రంగా ఉంచడంలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె కొనియాడారు.
ట్రస్ట్ అధ్యక్షులు సరితా ఓజా మాట్లాడుతూ.. లాక్డౌన్ విధించినప్పటి నుండి పట్టణంలోని చెక్ పోస్టుల వద్ద పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, నిరుపేదలు, పోలీసులతో సహా సుమారు 60 మందికి నిత్యం ఆహారం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్వారీ యువ మంచ్ అధ్యక్షుడు పవన్ తివారీ, ట్రస్ట్ కార్యదర్శి ఉషా సంక్లా, కోశాధికారి చేతనా గుప్తా, సలహాదారు సురేష్ అగర్వాల్, సభ్యులు ప్రేమలత అగర్వాల్, నాగిశెట్టి జ్యోతి, ప్రభా అగర్వాల్, గీతా వైష్ణవ్, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.