మంచిర్యాల టౌన్ : పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నవంబర్ 15న వరంగల్లో తలపెట్టిన టీఆర్ఎస్ విజయగర్జన సభను విజయవంతం చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పిలుపునిచ్చారు. బుధవారం మంచిర్యాలలోని పద్మనాయక ఫంక్షన్హాలులో ఏర్పాటుచేసిన మంచిర్యాల నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా తొమ్మిదోసారి ఎన్నికైన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్యేతోపాటు సమావేశానికి హాజరైన నాయకులు ముక్తకంఠంతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇరవై ఏళ్ల ప్రస్థానంలో కేసీఆర్ ఎక్కడా కూడా హింసకు తావులేకుండా శాంతియుత పంథాలో రాష్ట్రాన్ని సాధించి తెలంగాణాకు గాంధీగా పేరు తెచ్చుకున్నారని అన్నారు.
ఉద్యమించి సాధించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దేశం గర్వపడేలా పథకాలను ప్రవేవపెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అన్ని మతాలకు సమ ప్రాధాన్యతను ఇచ్చి వారి బాగోగులు చూస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులకు సంస్కారం లేదని, నోరుందని ఎవరిని పడితే వారిని దుర్భాషలాడుతూ మాట్లాడుతున్నారని, ఇలాంటి వారిని ప్రజలు తరిమికొట్టేరోజు దగ్గరలోనే ఉందన్నారు. ఈ సమావేశంలో మంచిర్యాల, నస్పూర్, లక్షెటిపేట మున్సిపల్ చైర్మన్లు పెంట రాజయ్య, ఇసంపల్లి ప్రభాకర్, నలుమాసు కాంతయ్య, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, డీసీసీబీ చైర్మన్ తిప్పిన లింగయ్య, రైతుసమన్వయ సమితి అధ్యక్షుడు గురువయ్య, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వసుంధర, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి, మహిళా విభాగం అధ్యక్షురాలు గరిగంటి సరోజ, నాయకులు గోగుల రవీందర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.