సీసీసీ నస్పూర్ : సీసీసీ నస్పూర్లో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం సీసీసీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ అఖిల్ మహాజన్ గంజాయి రవాణాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సీసీసీ ఆర్కే-5కాలనీకి చెందిన సంగంరెడ్డి వెంకటేశ్, సీసీసీ గాంధీనగర్కు చెందిన ఎల్లందుల సుధాకర్లు గంజాయి తాగుడుకు, చెడు అలవాట్లకు బానిసై కూలీ పనిచేయగా వచ్చిన డబ్బులతో జల్సాలకు అలవాటు పడ్డారు. వీరికి వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో ఇద్దరు గంజాయి అమ్మకాలు చేయాలని నిర్ణయించుకున్నారు.
గత నెల రోజుల క్రితం ఇద్దరు కలిసి వైజాగ్ వెళ్లి అరకు గ్రామంలో కిలో గంజాయిని రూ.5వేలకు కొనుగోలు చేశారు. ఒక్కొక్క ప్యాకెట్ చేసి రూ.300 అమ్మాలని నిర్ణయించారు. వీరు తయారు చేసిన గంజాయి ప్యాకెట్లను శనివారం విక్రయించడానికి సీసీసీ ఆర్కే-5కాలనీ సమీప సీఎస్ఐ చర్చి డంపుయార్డు దగ్గరకు రాగానే పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 450గ్రాముల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ వివరించారు. గంజాయి సాగు, రవాణా, అమ్మకాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. యువత గంజాయికి బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ సమావేశంలో సీఐ తోట సంజీవ్, ఎస్ఐ శ్రీనివాస్, ఏఎస్ఐ జితేందర్, కానిస్టేబుల్ తిరుపతి పాల్గొన్నారు.