లక్షెట్టిపేట రూరల్ : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. గురువారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో రూ. 22 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని, ఈ క్రమంలోనే అంతర్గత రోడ్లు, లింక్ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. నియోజక వర్గంలో చేపట్టిన ప్రతి బ్రిడ్జి కింద చెక్ డ్యాములు నిర్మించామని, ఒక్కో చెక్డ్యాం కింద 30 నుంచి 40 ఎకరాల భూమి సాగవుతుందన్నారు.
గత ఏడాది వేసవి కాలంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరు ఎత్తిపోయడం ద్వారా 18 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని వాడుకున్నామన్నారు. పారిశుధ్య కార్మికుల సేవలు అమోఘమని వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అన్నం మంగ, జడ్పీటీసీ ముత్తె సత్తన్న, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీటీసీ గడుసు స్వప్న, తిమ్మాపూర్ సర్పంచ్ చుంచు రవి, ఉప సర్పంచ్ ముత్తె రాజ్కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చుంచు చిన్నయ్య, ఉపాధ్యక్షుడు అంకతి రమేశ్, గ్రామ అధ్యక్షుడు ఎంబడి భూమయ్య, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.