రామకృష్ణాపూర్ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. భారత్ కి ఆజాద్ కా అమృత మహోత్సవంలో భాగంగా రామకృష్ణాపూర్ ఏరియా దవాఖానలో నిర్వహించిన స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్రం కోసం ఎందరో వారి జీవితాలను త్యాగం చేశారని పేర్కొన్నారు. ఆ త్యాగధనులను స్మరించుకుంటూ 75 సంవత్సరాలలో సాధించిన ప్రగతిని, అభివృద్ధిని, విజయాలను గుర్తు చేసుకుంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఆజాది కా అమృత మహోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వారంరోజుల పాటు పరిసరాల పరిశుభ్రతపై ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజల్లో అవగాహన పెంచాలనే ఉద్దేశంతో భారత దేశం అంతటా వీటిని నిర్వహిస్తుందని పేర్కొన్నారు.
ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటారని తెలిపారు. వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు సోకకుండా సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ప్రజలు పరిసరాల శుభ్రతను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి అక్బర్ అలీ, సీఏవోఏఐ అధ్యక్షుడు జక్కారెడ్డి, పర్సనల్ మేనేజర్ వరప్రసాద్ , డీజీఎం శ్రీనివాసులు, డీవై సీఎంఓ డాక్టర్ ప్రసన్నకుమార్, పర్యావరణ అధికారి ప్రభాకర్, ఈఈ రవికుమార్, సంక్షేమ అధికారి శ్రీనివాస్, డాక్టర్లు రాజా రమేశ్, రాంమోహన్, కార్మిక సంఘాల నాయకులు, దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.