తిర్యాణి : ప్రజలందరికీ న్యాయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్న న్యాయ విజ్ఞాన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా జడ్జి నారాయణ బాబు అన్నారు. మండలంలోని ఏదులపాడ్, చింతపల్లి, దేవయిగూడ గ్రామాల్లో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర న్యాయ శాఖ ఆదేశాల మేరకు ప్రతీ పేదవాడికి న్యాయ వ్యవస్థను అందుబాటులోకి తేవడానికి జిల్లా వ్యాప్తంగా సదస్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు.
సదస్సులలో భూముల కేసులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. తమ దృష్టికి వచ్చిన కేసులను సంబంధిత శాఖలకు అప్పగించి త్వరితగతిన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థను ఉచితంగా వినియోగించుకునేలా ప్రత్యేక న్యాయవాదిని సైతం నియమించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను ప్రజాప్రతినిదులు, అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వైవి సుదీంద్ర, ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి, ఎస్ఐ రామారావు, ఎంపీటీసీ బూర రాజ్యలక్ష్మి నాయబ్ తాసిల్దార్ మస్కూర్ అలీ , సర్పంచులు తదితరులు ఉన్నారు.