సీసీసీ నస్పూర్ : సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి సన్నాహాలు చేస్తున్నామని డైరెక్టర్ (పా, పీపీ, ఫైనాన్స్) బలరాం వెల్లడించారు. సీసీసీ సింగరేణి గెస్ట్హౌజ్లోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ సింగరేణి స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్పొరేట్ కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ మాంథ శ్రీనివాస్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. సింగరేణిలోని 4 ఏరియా ఆసుపత్రులు, అన్ని డివిజన్ ఆసుపత్రుల వైద్య అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ బలరాం మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాలపై యాజమాన్యం ప్రత్యేక దృష్టిసారించి వారికి మెరుగైనా వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. వారం రోజుల్లో రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో సీటీ స్కాన్ ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రామగుండం ఏరియాలో సింగరేణి మెడికల్ కళాశాల ఏర్పాటు జరుగుతుందని, ఇందుకు సంబంధించి ఇన్ఫాస్ట్రక్చర్ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. రామకృష్ణాపూర్, కొత్తగూడెం, రామగుండం సింగరేణి ఏరియా ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.
సింగరేణిలో వైద్యుల కొరత లేకుండా ఔట్ సోర్సింగ్ ద్వారా వైద్య నిపుణులు, సిబ్బందిని నియమిస్తున్నామని చెప్పారు. అనారోగ్యంతో మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు పెళ్లిల్లు అయినా, కాక పోయినా 35 సంవత్సరాల వయసు లోపు మహిళలకు ఉద్యోగాలు కల్పించడానికి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 17న సర్క్యులర్ జారీ చేశామన్నారు. ఈనెల 25న జరిగే బోర్డు మీటింగ్లో లాభాల వాటాపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో శ్రీరాంపూర్ జీఎం సురేశ్, ఎస్ఓటూజీఎం గుప్తా, రామక్రిష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉషారాణి, డీవైజీఎం గోవిందరాజు, అన్ని ఆస్పత్రుల వైద్య అధికారులు పాల్గొన్నారు.