గర్మిళ్ల : రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం కొనివ్వలేదని ఒక విద్యార్థి క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణ ఏఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న గురాల సన్నిత్ (17) అనే విద్యార్థి కొంత కాలంగా కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో అటెండర్గా పని చేసే తల్లి శశికళను రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొనివ్వమని అడుగుతున్నాడు.
వయస్సు చిన్నది కావడంతో తర్వాత కొనిస్తానని తల్లి చెబుతూ వస్తుంది. ఈ క్రమంలో సన్నిత్ మనస్తాపానికి గురై ఈ నెల 6న పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి తల్లి శశికళ ఇచ్చిన ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.