మంచిర్యాల : మంచిర్యాల సఖి సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఓ చిన్నారి ప్రాణాపాయం నుంచి బయట పడింది. వారు చూపిన ఔదార్యం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..మహారాష్ట్రలోని సిరవంచ జిల్లా బెజ్జుర్ పల్లి గ్రామానికి చెందిన సోని, మల్లేష్ దంపతులకు ఆరు రోజుల పాప ఉంది. తనకి శ్వాసకి సంబంధించిన ఇబ్బంది ఎదురవడటంతో మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తీసుకువచ్చారు.
అక్కడ సిబ్బంది సరిగాస్పందించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పక్కనే ఉన్న సఖి ఆఫీస్ ఎదురుగా కూర్చుండి పోయారు. వీరిని గమనించిన సఖి సిబ్బంది ఆరా తీశారు. పాపకి శ్వాస సమస్యతో పాటు ఫిట్స్ వచ్చాయి. కరీంనగర్ వెళ్లేందుకు, ట్రీట్మెంట్కు కూడా వారి వద్ద డబ్బులు లేకపోవడంతో సఖి కేంద్రం వారు ముందుకొచ్చారు.
ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వారితో పాటు అంబులెన్స్ డ్రైవర్స్ సైతం ముందుకు రావడంతో పాపకి చికిత్స జరుగుతోంది. చిన్నారికి వైద్యం అందిచేందుకు ముందుకు వచ్చిన సఖి సెంటర్ సిబ్బందిని పలువురు అభినందించారు.