హాజీపూర్ : సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ పోడు భూముల వివరాలను నమోదు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అటవీశాఖ అధికారి శివాని డోంగ్ర, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్తో కలిసి రెవెన్యూ, అటవీశాఖల అధికారులు, సర్వేయర్లతో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 106 ఆవాస ప్రాంతాలు ఉన్నాయని ప్రతీ ఆవాస ప్రాంతానికి ఒక అటవీ హక్కుల కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, జిల్లాలోని సర్వేయర్లందరికీ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పై తగిన శిక్షణను అందిస్తున్నామని వివరించారు.
ఆర్వోఎఫ్ఆర్-2005 చట్టం ప్రకారం 2005 సంవత్సరం నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారి వద్ద వివరాలను స్వీకరిస్తున్నామని అన్నారు. ప్రతి ఆవాస ప్రాంతంలో ఉన్న భూములకు సంబంధించి జీపీఎస్ను నమోదు చేస్తున్నామని, నెట్వర్క్ లేని ప్రాంతాల్లో ప్రభుత్వం సూచించిన జీపీఎఫ్ యాప్ను వినియోగించడం ద్వారా సమీప ప్రాంతాలను గుర్తించడం జరుగుతుందని వెల్లడించారు. జిల్లాలో 311 గ్రామ పంచాయతీలు ఉండగా 81 గ్రామ పంచాయతీలలో పోడు వ్యవసాయం సాగు కోసం భూ ఆక్రమణ జరిగిందన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి వివరాలను సేకరించాలన్నారు.