మంచిర్యాల : ప్రభుత్వ ఉపాధ్యాయుడితో సహా మరో ముగ్గురు వ్యాపారులపై పోలీసులు పీడీ చట్టం అమలు చేశారు. ఈ ఘటన మంచిర్యాలలో శుక్రవారం చోటుచేసుకుంది. వీరంతా ఓ ముఠాగా ఏర్పడి నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తుండటంతో అరెస్టు చేసి పీడీ యాక్ట్ అమలు చేసినట్లు సీపీ వి. సత్యనారాయణ తెలిపారు. నిందితులు బెల్లంపల్లిలోని ఇన్క్లేన్ బస్తీకి చెందిన వ్యాపారి పల్లిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూర్ మండలానికి చెందిన పూసా సుబ్బారావు, భేమిని మండలం వెంకటపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, భీమిని మండల కేంద్రానికి చెందిన ఎరువుల దుకాణ యజమాని చౌదరి దినేష్.
ప్రభాకర్, సుబ్బారావు, సురేష్ ఒక ముఠాగా ఏర్పడి చాలా కాలం నుండి ఈ దందాలు చేస్తున్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో మూడు నేరాల్లో వీరు పాలుపంచుకున్నట్లు సమాచారం. ఏపీలోని కర్నూలులో గల గొల్లపుడి రోషయ్య అనే వ్యక్తి నుండి విత్తనాలను సేకరిస్తున్నారు. నకిలీ పత్తి విత్తనాలను విక్రయించి రైతులకు నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సత్యనారాయణ ఈ సందర్భంగా హెచ్చరించారు. వ్యాపారులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు.