మంచిర్యాల ఏసీసీ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రజల సౌకర్యార్ధం ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. రూ. 80 లక్షలతో ఎన్హెచ్ఏఐ, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆక్సీజన్ ప్లాంట్ను గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆక్సీజన్ ప్లాంట్తో ప్రజలకు ఎంతో మేలు కలుగనుందని, ఇక ఆక్సీజన్ కొరతపై రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని , ఇకపై ఆక్సీజన్ వినియోగం అందుబాటులో ఉంటుందని, 500 ఎల్.పీ.ఎం (లీటర్ ఫర్ మినట్)ల ఆక్సీజన్ ఉత్పత్తి జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రతి నిత్యం జిల్లా నలుమూలల నుంచి అనేక మంది వైద్య సేవల నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు వస్తుంటారని, దవాఖానలో అన్ని వసతులతో మెరుగైన వైద్యసదుపాయలు అందించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకేసారి వంద పడకలకు ఈ ప్లాంట్ ద్వారా ఆక్సీజన్ సరఫరా చేసేందుకు అవకాశం ఉందని, విద్యుత్ అంతరాయం ఏర్పడితే ఇబ్బంది లేకుండా ఆక్సీజన్ను నిరంతరంగా ఉత్పత్తి చేసేందుకు జనరేటర్ను అనుసంధానం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ నూతన అరవింద్, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, ఆక్సీజన్ ప్లాంట్ ఇన్చార్జి శ్రీలత, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సుబ్బరాయుడు, కౌన్సిలర్ సత్యనారాయణ, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.