సీసీసీ నస్పూర్, మే 11: కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభు త్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదనిఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు స్పష్టం చేశారు. నస్పూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. కొవిడ్ నిర్ధారణ పరీక్షల తీరు, ఫీవర్ సర్వే, వ్యాక్సినేషన్ ప్రక్రియను సూపరింటెండెంట్ డాక్టర్ జయప్రకాశ్ను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందికి పలు సూచనలు సలహాలు, చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా పీహెచ్సీకి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మున్సిపల్, వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఫీవర్ సర్వే కొనసాగుతుందని, రోగులకు కిట్లు కూడా అందిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న వారంతా కోలుకుంటున్నట్లు చెప్పారు. ఆయా వాడల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కమిషనర్ తుంగపిండి రాజలింగు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వంగ తిరుపతి, నాయకులు గర్శె భీమయ్య, రవిగౌడ్, తదితరులు పాల్గొన్నారు.