పట్టణంలో వేగంగా అభివృద్ధి పనులు
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 24 : ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని బంగారుగూడ గ్రామాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బంగారుగూడ వాగుపై రూ.5 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి ని ర్మాణ పనులకు శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వంతెన నిర్మాణంతో యాపల్గూడ, రామాయి, సాత్నాలలాంటి అనేక గ్రామాల ప్రజలకు వర్షాకాలంలో ఇబ్బందులు దూరమవుతాయన్నారు. వచ్చే వర్షాకాలంలోపు నిర్మాణ పనులు పూర్తి చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో ఆర్అండ్బీ ద్వారా రూ.320కోట్లతో రహదారులు, వంతెనలు ని ర్మించామని తెలిపారు. మరో రూ.145 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నతాధికారుల వద్ద పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఇక్కడ మోడల్స్కూల్, మైనార్టీ స్కూల్, పోలీస్ బెటాలియన్, రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ మంజూరయ్యాయని, వ్యవసాయ కళాశాలకు సైతం 50ఎకరాల భూమిని ఇక్కడే కేటాయించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్చైర్మన్ జహీర్ రంజానీ, మున్సిపల్ కమిషనర్ శైలజ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి..
పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు, కాంట్రాక్టర్లు కృషి చేయాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ ఎంట్రెన్స్ మావల వద్ద నిర్మిస్తున్న ఆర్చ్ పనులను పరిశీలించారు. అర్అండ్బీ, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడారు. పట్టణంలో నిర్మిస్తున్న డివైడర్, సెంట్రల్లైటింగ్ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రణాళికాబద్ధంగా పనులు నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పట్టణ సుందరీకరణలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆయన వెంట అర్అండ్బీ ఈఈ సురేశ్, మున్సిపల్ డీఈ తిరుపతి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.