ఎదులాపురం, జూన్ 5 : కొనుగోలు చేసిన విత్తనాలపై అనుమానాలు ఉంటే రైతులు ఫిర్యాదు చేయాలని జిల్లా ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్ చంద్ర అన్నారు. తంతొలి గ్రామానికి చెందిన బీ వెంకట్ యాదవ్, భీమనవేన మల్లేశ్, దత్తు శంకర్, వెంకటేశ్తో పాటు మరికొందరు రైతులు ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆయనకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గాంధీ చౌక్లోని ఓ దుకాణంలో సోయాబీన్ విత్తనాలు కొనుగోలు చేశామన్నారు. అయితే ఆ బస్తాలపై లాట్ నంబర్, ఎమ్మార్పీ ధరలు దిద్ది ఉన్నాయన్నారు. దీంతో ఇన్చార్జి ఎస్పీ ఎం రాజేశ్ చంద్ర స్పందించి వెంటనే వ్యవసాయ అధికారితో కలిసి విచారణ చేపట్టాలని టాస్క్ఫోర్స్ సీఐ చంద్రమౌళిని ఆదేశించారు.
దీంతో వారు షాపునకు వెళ్లి తనిఖీ చేశారు. ఫోన్లో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడగా కరోనా లాక్డౌన్ దృష్ట్యా గతనెల 11న ప్యాకింగ్ ముద్రించిన పాత ఖాళీ సంచులను వినియోగించామని వారు బదులిచ్చారు. అనంతరం ఇన్చార్జి ఎస్పీ మాట్లాడుతూ విత్తన ప్యాకెట్లు, లేబుళ్లను పంటకాలం పూర్తయ్యేవరకు భద్రపర్చుకోవాలన్నారు. ఒకవేళ రైతులను మోసం చేసినట్లు నిర్ధారణ అయితే షాపు యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్, లాట్ నంబర్ సరిచూసుకొని కొనుగోలు చేసి బిల్లుపై డీలర్, రైతుల సంతకం తీసుకోవాలని సూచించారు. స్పెషల్ బ్రాంచ్ సీఐ జీ మల్లేశ్, వన్టౌన్ సీఐ రామకృష్ణ, కార్యనిర్వహణధికారి దుర్గం శ్రీనివాస్, వ్యవసాయ అధికారులు రమేశ్, శివకుమార్, రమేశ్కుమార్, తదితరులు ఉన్నారు.
ప్రశాంతంగా లాక్డౌన్..
ఎదులాపురం, జూన్ 5 : జిల్లాలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుందని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. జిల్లా కేంద్రంలో లౌక్డౌన్ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించిన 582 మందిపై కేసులు , జరిమానాలు విధించామన్నారు. 29 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఓఎస్డీ హర్షవర్దన్ శ్రీవాస్తవ్, అదనపు ఎస్పీ వినోద్ కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వరరావు, కే. ఉమామహేశ్వరరావు, సీఐలు ఎస్ రామకృష్ణ, పోతారం శ్రీనివాస్, ఈ. చంద్రమౌళి పాల్గొన్నారు.