రామకృష్ణాపూర్ : సింగరేణి ఉత్పత్తి లక్ష్యసాధనకు యంత్రాలను సద్వినియోగం చేసుకొని ముందుగు సాగాలని డైరెక్టర్ (ఫైనాన్స్, పి అండ్ పి, ఫా) ఎన్. బలరామ్ అన్నారు. శుక్రవారం మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఉపరితల గనిలో కొమట్స్ హెచ్డీ -465, 60 టన్నుల సామర్థ్యం గల 5 డంపర్లను ఏరియా జీఎం చింతల శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ చొరవతో అత్యధిక టెక్నాలజీతో రూపొందించిన 5 డంపర్లను కొనుగోలు చేశారని, ఒక్కో డంపర్ 2 కోట్ల 7 లక్షల 50వేల రూపాయల విలువ ఉంటుందని వివరించారు.
ఒక్కొక్కదాని సామర్థ్యం 60 టన్నులు అని, వీటిని సక్రమంగా ఉపయోగించుకుని రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించి సంస్థ పురోగభివృద్ధికి కలిసి కట్టుగా పని చేసి ముందుకు వెళ్లాలని కోరారు. ఉత్పత్తి, కార్మికుల క్షేమం కోసం సంస్థ సీఅండ్ఎండీ ముందుంటారని పేర్కొన్నారు. ఆర్కేపీ ఓసీపీ ప్రాజెక్ట్ ప్రాంగణంలోని దుర్గాదేవి ఆలయ పరిసరాల్లో జమ్మి మొక్కలను నాటారు. కార్యక్రమంలో జీఎం ఈ అండ్ ఎం(ఓసీపీఎస్) వై. గోపాలాకృష్ణమూర్తి, జీఎం(ఎస్వోటు డైరెక్టర్ పి అండ్ పి) డి రవిప్రసాద్, ఏజీఎం (ఈ అండ్ ఎం) జగన్మోహన్రావు, గుర్తింపు సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి అక్బర్అలీ, సీఎంఓఏఐ అధ్యక్షుడు జక్కారెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ మధుసూదన్, పి.ఎం వరప్రసాద్, మేనేజర్ వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ ఇంజినీర్ మహేందర్, యూనియన్ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు.