భీమారం : మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఆరెపల్లి గ్రామంలో మంగళవారం ఓ యువతి అనుమానాస్పదంగా వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు , స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆరెపల్లి గ్రామానికి చెందిన యువతి(20) కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన దుర్గం శేఖర్ను ప్రేమించింది. అప్పటికే దుర్గం శేఖర్కు చెన్నూర్ మండలంలోని కొమ్మర గ్రామానికి చెందిన మరో మహిళతో మూడు సంవత్సరాల క్రితం వివాహం జరుగగా ఆమెతో తెగదెంపులు చేసుకుని నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇదే క్రమంలో రెండు లక్షలు తీసుకువస్తే మొదటి భార్యకు ఇచ్చి నిన్ను వివాహాం చేసుకుంటానని వేధింపులకు పాల్పడినట్లు వారు తెలిపారు.
మంగళవారం మధాహ్నాం ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి రాత్రి వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం అనేక చోట్ల గాలించారు. బుధవారం గ్రామ సమీపంలోని బ్రహ్మయ్యకు చెందిన వ్యవసాయ బావిలో అనుమానంతో వెదకగా మృతదేహం లభ్యం అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శేఖర్ వేధింపులు భరించలేకనే తమ కూతురు మృతి చెందినట్లు యువతి తండ్రి సత్తయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు న్యాయం చేసేంతవరకు శవాన్ని పంచనామాకు తరలించవద్దని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.
స్థానిక ఎస్ఐ అశోక్ వారిని సముదాయించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.