రామకృష్ణాపూర్ : మందమర్రి ఏరియా ఆర్కేపీ సీహెచ్పీ నుంచి బొగ్గు రవాణాను మెరుగు పరిచేందుకు ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ( నలుగురు జీఎంలు) సభ్యుల బృందం గురువారం సీహెచ్పీని సందర్శించింది. ఈ సందర్భంగా ఏరియా జీఎం మాట్లాడుతూ సింగరేణి బొగ్గుకు ప్రాధాన్యత పెరిగిన దృష్ట్యా ఉత్పత్తి, రవాణాలో సంస్థ దూసుకుపోతుందని అన్నారు. అందులో భాగంగా ఏరియాలోని ఆర్కేపీ సీహెచ్పీని నుంచి సాధ్యమైనంత ఎక్కువగా బొగ్గు రవాణా చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
దీనికి కావలసిన మౌలిక సదుపాయాలు, తగిన మెటీరియల్, మిషనరీస్, అంతర్గత రోడ్లు తదితర అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో ఎలా ముందుకు సాగాలనే విషయాలపై బృందం సభ్యులు చర్చించారు. ఈ కార్యక్రమంలో జీఎం సీ.పీ.పీ నాగభూషన్రెడ్డి, సివిల్ జీఎం రమేశ్ బాబు, జీఎం (సీహెచ్పీ) స్వామినాయుడు, ఎస్వోటూ జీఎం గోపాల్సింగ్, ఏజీఎం జగన్మోహన్రావు, రైల్వే ఏవో (రామగుండం) అవినాష్, ఆర్కేపీ సీహెచ్పీ డీజీఎంలు చెరువు శ్రీనివాస్, భగవతి , డీవై ఎస్ఈ ఎ. చంద్రమౌళి, గుర్తింపు సంఘం ఫిట్ కార్యదర్శి జే. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.