బెల్లంపల్లిరూరల్ : పోషకాహార విలువలతో కూడిన చిరుధాన్యాల ప్రాముఖ్యతపై మహిళలకు అవగాహన కల్పించి ఆహారాన్ని తీసుకునేలా ప్రోత్సహించాలని అంగన్వాడీ టీచర్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సూచించారు. శుక్రవారం బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన చిరుధాన్యాల దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో చేస్తున్న కృషిని అభినందించారు. కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వర్నాయక్ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో మనిషి మంచి ఆహారానికి దూరమవుతున్నాడన్నారు. చిరుధాన్యాల అవసరాన్ని వివరించడంతో పాటు పోషక విలువలున్న ఆహారాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు.
ఐసీడీఎస్ సీడీపీవో ఉమాదేవి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు క్షేత్రస్థాయిలో గర్భిణులు, చిన్న పిల్లల ఆరోగ్య విషయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పౌష్టిహాకారం పై అవగాహన కల్పించాలన్నారు. సమతుల ఆహారాన్ని అందించడంలో ప్రత్యేక కృషి చేయాలన్నారు. అనంతరం మహిళలకు, అంగన్వాడీ టీచర్లకు పండ్ల మొక్కలు, కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ టి.సత్యనారాయణ, ఎంపీపీ గొమాస శ్రీనివాస్, మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎం.రాజశేఖర్, మండల ఉపాధ్యక్షురాలు వెంబడి రాణి, కాసిపేట జడ్పీటీసి పల్లె చంద్రయ్య, కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు, డాక్టర్ శివకృష్ణ, నాగరాజు, మహేశ్, స్రవంతి, వ్యవసాయాధికారి సుద్దాల ప్రేమ్కుమార్, నాయకులు జక్కుల శ్రీధర్, వెంబడి సురేశ్, తదితరులు పాల్గొన్నారు.