రామకృష్ణాపూర్ : అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషి ఫలితంగానే అధిక బొగ్గు రవాణా సాధ్యమైందని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రామకృష్ణాపూర్ సీహెచ్పీని సందర్శించి భూగర్భ బంకర్లను, బొగ్గు నాణ్యతను, అంతర్గత రహదారుల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్షణకు ప్రాధాన్యతను ఇస్తూనే అధిక బొగ్గు రవాణాకు కృషి చేయాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ఆర్కేపి సీహెచ్పీలోని అంతర్గత రహదారులు గుంతలు పడటం, బొగ్గు తడవం వల్ల బంకర్లలో బొగ్గు జారక పోవడం లోడింగ్ ఆలస్యం లాంటి సమస్యలను అధిగ మించి ఉద్యోగులు రోజుకు 3 రేకులు వంతున బొగ్గును రవాణా చేశారని తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరం 41.09 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని యాజమాన్యం నిర్ణయించగా సెప్టెంబర్ 23వ తేదీ వరకు 16.02 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును రవాణా చేశామని వెల్లడించారు.
గత వార్షిక సంవత్సరం 39.75 లక్షల టన్నులు లక్ష్యంగా నిర్ణయించగా కరోనా లాక్డౌన్ కారణంగా 7.56 లక్షల టన్నుల బొగ్గును మాత్రమే రవాణా జరిగిందన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రెండింతల కంటే అధికంగా బొగ్గు రవాణా జరిగిందన్నారు. రోజుకు 3 రేకుల వంతున రవాణా జరిగితే వార్షిక సంవత్సరం చివరి నాటికి లక్ష్యాన్ని అధిగమించడం ఖాయమని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఆర్కేపీ సీహెచ్పీలోని ప్రతి విభాగాన్ని సందర్శించి సమస్యలను అధిగమించేందుకు సీహెచ్పీ అధికారులకు సూచనలు చేశారు.
సీహెచ్పీలో చేపట్టిన అంతర్గత రహదారుల నిర్మాణాలను పరిశీలించారు. అదేవిధంగా ఈ నెలలో 21వ తేదీ నాటికి రోజుకు 3 రేకుల చొప్పున 60 రేకుల బొగ్గును రవాణా పూర్తి చేసినందుకు అధికారులను, ఉద్యోగులను అభినందించారు. కార్యక్రమంలో సీహెచ్పీ డీజీఎం చెరువు శ్రీనివాస్, డివై ఎస్.ఈ చంద్రమౌళి, సివిల్ జే ఈ దేవికుమార్, ఫిట్ కార్యదర్శులు జే. శ్రీనివాస్, సంజీవ్ పాల్గొన్నారు.