శ్రీరాంపూర్ : కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో రెండు, మూడు రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవని, దీంతో ఇతర రాష్ట్రాల్లోని సుమారు 15 పెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి సింగరేణి బొగ్గుకు తీవ్ర డిమాండ్ ఉందని సింగరేణి సీ ఆండ్ ఎండీ ఎన్ శ్రీధర్ పేర్కొన్నారు. హైదరాబాద్ తెలంగాణా భవన్ నుంచి సోమవారం అన్ని ఏరియాల జీఎంలతో ఉత్పత్తి, రవాణాపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సింగరేణి బొగ్గుకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో లక్ష్యాలకు అనుగుణంగా ఉత్పత్తిని సాధించాల్సిన బాధ్యతను అన్ని ఏరియాల అధికారులు సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. సింగరేణితో ఒప్పందం ఉన్న తెలంగాణాలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇప్పుడు వారం నుంచి 10 రోజుల వరకు బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ, ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తీవ్ర బొగ్గు కొరత ఉన్నందున సింగరేణి సంస్థ తన వంతుగా నిర్ధేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను దాటి బొగ్గు రవాణా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
విదేశీ బొగ్గు ధర 100 శాతం పైగా పెరగడంతో అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాలతో పాటు స్పాంజ్ ఐరన్, సిమెంట్ వంటి పరిశ్రమలు నేడు స్వదేశీ బొగ్గు వైపు చూస్తున్నాయని, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కూడా దాదాపు ప్రతి రోజూ ఇదే విషయంపై సమీక్షలు జరుపుతుందని పేర్కొన్నారు. , బొగ్గు ఉత్పత్తి, రవాణాలను పెంచాలని కోరుతున్నారని చెప్పారు.
ఇప్పుడు వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టినందున అక్టోబర్లో రోజుకి కీసంగా 1.9 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, అలాగే అదే పరిమాణంలో బొగ్గు రవాణా చేయాలని, 13 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి (మట్టి) తొలగించాలని ఆదేశించారు. ఇకపై ఏరియాల జనరల్ మేనేజర్లు బొగ్గు ఉత్పత్తి, రవాణాపైనే పూర్తి దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సింగరేణి భవన్ నుంచి డైరెక్టర్ (ఆపరేషన్) ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ (ఈఆండ్ఎం) డీ సత్యనారాయణ, డైరెక్టర్ (పైనాన్స్, పా, పీపీ) ఎన్ బలరాం, అడ్వైజర్ (మైనింగ్) డీఎన్ ప్రసాద్, అడ్వైజరీ (ఫారెస్ట్రీ) సురేంద్రపాండే తదితర అధికారులు పాల్గొన్నారు.