బయోడేటా..
బాల్క సుమన్
తండ్రి పేరు : స్వర్గీయ బాల్క సురేశ్
విద్యార్హతలు : ఎంఏ, ఎంఫిల్ (పీహెచ్డీ)
గ్రామం : రేగుంట, మెట్పల్లి నియోజకవర్గం
పదవులు : 2010 టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు, పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యుడు
ప్రస్తుతం : ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
భార్య : రాణి అలేఖ్య, పిల్లలు : బాల్క సుహాన్, సుశాన్
మంచిర్యాల, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : సమష్టి కృషితో పార్టీని మరింత బలోపేతం చేసి తిరుగులేని శక్తిగా నిలబెడుతానని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆయన బుధవారం పలు విషయాలను ‘నమస్తే తెలంగాణ’కు వెల్లడించారు. గతంలో పెద్దపల్లి ఎంపీగా పనిచేసిన అనుభవం తనకు కలిసొచ్చిన అంశమని, జిల్లాలో బూత్ స్థాయి నుంచి గ్రామ, పట్టణ, మున్సిపల్ స్థాయిల వరకు పార్టీని మరింత బలోపేతం చేయడమే తన ముందున్న లక్ష్యమని చెప్పారు. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ తప్ప.. ఏ ఇతర పార్టీలూ లేవని ఉద్ఘాటించారు. అబద్ధాలు, దుష్ప్రచారాలతో తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాలనే విపక్షాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రజల పార్టీ అని, సంక్షేమ పార్టీ అని అభివర్ణించారు. అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులను సమన్వయం చేసుకొని ముందుకెళ్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో పదవి కట్టబెట్టిన పార్టీ వ్యవస్థాపకుడు కేసీఆర్కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని హోదా కన్నా.. బాధ్యతగానే భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని ఎన్నికల్లోనూ పార్టీకి ఘన విజయాన్ని అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ కన్నతల్లిలాంటిదని, కష్టపడ్డవారికి పార్టీ గుర్తింపునిస్తుందనడానికి తననే ఉదాహరణగా చెప్పారు. తనను విద్యార్థి నాయకుడి నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న జిల్లా మంచిర్యాల అని కొనియాడారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తనూ కడుపులో పెట్టుకొని చూసుకుంటామని, తగిన గుర్తింపు ఇస్తామని భరోసా ఇచ్చారు. యువజన, విద్యార్థి, సోషల్ మీడియా, మహిళా విభాగాల బలోపేతానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉందని, అందుకు అనుగుణంగా ప్రత్యేకంగా యువకులను సన్నద్ధం చేస్తామని ప్రకటించారు. జిల్లాలోని సమస్యలపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే పార్టీపరంగా జిల్లాలోని అన్ని కమిటీలను పూర్తి చేసి సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామని, అవసరమైతే శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ సభ్యత్వ వివరాలపై నాయకులతో త్వరలోనే సమన్వయ సమావేశం నిర్వహిస్తామని విప్ సుమన్ తెలిపారు. గతంలో ఉన్నత పదవులు అనుభవించిన విపక్ష నాయకులు జిల్లాకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జిల్లాలో పనులు కొనసాగుతున్నాయని పునరుద్ఘాటించారు.
విశ్వసనీయత.. విధేయతకు పట్టం
విప్ బాల్క సుమన్కు మరో కీలక బాధ్యత
మంచిర్యాల, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్కు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మరో కీలక బాధ్యత అప్పగించింది. పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. అధిష్టానానికి అత్యంత సన్నిహితుడిగా, విధేయుడిగా ఉన్న బాల్క సుమన్ పార్టీలో, ప్రభుత్వంలో ముఖ్య నేతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. అన్ని వేదికలపైనా తన వాణిని వినిపిస్తూ రోజురోజుకూ ప్రజల్లో ఆదరాభిమానాలు చూరగొంటున్నారు. ప్రతిపక్షాలకు తనదైన రీతిలో బుద్ధిచెబుతున్నారు.
ఇంతింతై..
టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతగా బాల్క సుమన్ తెలంగాణ సాధ న ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం కో సం అనేక సార్లు జైలుకు వెళ్లారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం వందల కేసులు బనాయించినా మొక్కవోని ధైర్యంతో, ఎక్కడా తగ్గకుండా పనిచేశారు. ఆయన ఉద్యమ స్ఫూర్తిని, విశ్వసనీయతను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు అప్పుడే టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించారు. ఉద్యమ నేపథ్యంలో వచ్చిన అనే క ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం తీవ్రంగా శ్రమించారు. ఆయన పట్టుదల, కార్యదక్షతను చూసి 2014 లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి టికెట్ ఇచ్చారు. విద్యార్థి నేతగా బరిలోకి దిగిన బాల్క సుమన్ నాటి సిట్టింగ్ ఎంపీ గడ్డం వివేక్పై సంచలన విజయం సాధించారు. అతి చిన్న వయస్సులో పార్లమెంట్లో అడుగు పెట్టడంతో పాటు చురుకైన పార్లమెంటేరియన్గా పార్టీలకతీతంగా అందరి ప్రశంసలు పొందారు. 2017లో జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో అత్యంత కీలకమైన శ్రీరాంపూర్ డివిజన్లో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గెలుపులో కీలకపాత్ర పోషించారు. ‘ఇంతింతై’.. అన్నట్లు.. ఉద్యమ నాయకుడి నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా, విప్గా అనేక బాధ్యతల్లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిత్యం అభివృద్ధి పనులు కొనసాగిస్తూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో ముందంజ
పార్టీ అధిష్టానం ఆదేశం ప్రకారం 2018లో చెన్నూర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేశ్ నేత గెలుపులోనూ అత్యంత కీలకంగా వ్యవహరించారు. తనను ఆదరించిన చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు.