మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 2005 మంది కి 1422 మంది విద్యార్థుల హాజరు
మంచిర్యాల అర్బన్, జూలై 25 : మహాత్మాజ్యోతి బాఫూలే గురుకులాల్లో ఇంటర్, డిగ్రీలో ప్రవేశానికి ఆదివారం జరిగిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇంటర్కు 1121 మంది, డిగ్రీలో చేరేందుకు 205 మంది, మొత్తం 1326 మంది ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందు కోసం జిల్లాకేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాల, బాలికల పాఠశాల, సాయికుంట హైస్కూల్, గర్మిళ్ల, మోడల్ స్కూల్, కా ర్మల్, ట్రినిటీ, శ్రీ చైతన్య పాఠశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్లో 1121 మందికి 814 మంది, డిగ్రీలో 205కు 165 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను జిల్లా పరీక్షల కన్వీనర్ శ్రీధర్, జిల్లా లెవల్ అబ్జర్వర్ పోచయ్య సందర్శించారు. కాగా పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు జరుగగా, ఉదయం తొమ్మిది గంటల నుంచే విద్యార్థుల టెంపరేచర్ పరీక్షించిన అనంతరం శానిటైజ్ చేసిన తర్వాతనే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
ఆసిఫాబాద్, జూలై 25 : మహాత్మాజ్యోతి బాఫూలే బీసీ గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 679 మంది విద్యార్థులకు 463 మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ రాజేశం, ఇన్చార్జి డీఈవో ఉదయ్బాబు సందర్శించారు.