మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి
గుడిపేట బెటాలియన్లో 371 మందికి పాసింగ్ అవుట్ పరేడ్
హాజీపూర్, జూలై 22 : శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. మండలంలోని గుడిపేటలోని 13వ ప్రత్యేక తెలంగాణ పోలీస్ బెటాలియన్లో తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 371 మందికి పోలీస్ కమాండెంట్ రామకృష్ణతో కలిసి పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా పరిస్థితుల్లోనూ శిక్షణను విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు. పోలీసులంటే కేవలం లాఠీలు పట్టుకునే వారు కాదని, సంఘ సేవకులు కూడా అని ఇటీవలి కాలంలో చాలా చూశామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, సీసీ టీవీల ఏర్పాటు, నూతన సాంకేతిక, మహిళలు, పిల్లల భద్రతలో తెలంగాణ పోలీస్లు దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెగ్యులర్ పోలీసింగ్తో పాటు ఆధునిక పరిజ్ఞానంలో కూడా శిక్షణ పొందడం తప్పనిసరి అని అన్నారు. అదేవిధంగా సైబర్ నేరాల నివారణకు పాటుపడాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు చిత్తశుద్ధి, అంకిత భావంతో విధులను నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో పటాలం అడిషనల్ కమాండెంట్ ఎంఐ సురేశ్, అస్టిటెంట్ కమాండెంట్లు రంగారెడ్డి, భిక్షపతి, నాగభూషణం, బెటాలియన్ అధికారులు, యూనిట్ వైద్యాధికారులు, ట్రైనింగ్ సిబ్బందితో పాటు తదితరులు పాల్గొన్నారు.