కొచ్చి, జూలై 12: కేరళలో ఇకపై ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టబోమని కిటెక్స్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సాబు ఎం జాకబ్ తెలిపారు. తమ రెండు రోజుల పర్యటనలో తెలంగాణ రాష్ట్రంలో ఘన స్వాగతం లభించిందని చెప్పారు. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో జరిపిన చర్చలు ఆ రాష్ట్ర సీఈవోతో నిర్వహించిన చర్చల్లా ఉన్నాయని అభివర్ణించారు. తెలంగాణలో ప్రాథమికంగా రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సంబంధించిన ప్రక్రియను త్వరలో ఖరారు చేస్తామన్నారు. కేరళ పరిశ్రమల శాఖను ‘బావిలో కప్ప’తో పోలుస్తూ ఇతర రాష్ర్టాల్లో పెట్టుబడిదారులకు ఉన్న స్నేహపూర్వక వాతావరణం గురించి దానికి తెలియదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ఇస్తామని చెప్పడంతో పాటు తనిఖీల పేరిట ఇబ్బందులకు గురిచేయబోమని హామీ ఇచ్చిందని తెలిపారు. తెలంగాణలో పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ‘మాకు తెలంగాణలో ఘన స్వాగతం లభించింది. పెట్టుబడి ప్రక్రియను రెండు వారాల్లో ఖరారు చేస్తా’మని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇతర రాష్ర్టాలు ఇస్తున్న ప్రోత్సాహకాలు ఏమిటో తెలుసుకునేందుకు తెలంగాణ పర్యటన ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు చౌకగా భూమి, నీరు, విద్యుత్తు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. కిటెక్స్… కేరళకు చెందిన వస్త్ర తయారీ, ఎగుమతి సంస్థ. కేరళ అధికారుల వేధింపులను భరించలేకపోతున్నామని ఆరోపిస్తూ రాష్ట్రం నుంచి తమ రూ.3,500 కోట్ల విలువైన ప్రాజెక్టును ఉపసంహరిస్తామని జాకోబ్ ఇటీవల ప్రకటించారు.