గోపాల్పేట, జూలై 12: ఆత్మహత్య సమస్యలకు పరిష్కారంకాదని.. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో బతకాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపర్తికి చెందిన నాసనల్లి రాములు చిన్న కొడుకు కొండల్ ఈ నెల 8న ఆత్మహత్య చేసుకోగా, సోమవారం మృతుడి కుటుంబాన్ని మంత్రి పరామర్శించి బాధిత కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇస్తామని హామీఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. ఏడేండ్లలో 1.35 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, మరో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతున్నట్టు వెల్లడించారు. 50 వేల ఉద్యోగాలకు 5 లక్షల మంది పోటీపడితే.. మిగిలిన 4.5 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకోవాలని ఆలోచిస్తే సమస్య పరిష్కారం అవుతుందా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.