చొప్పదండి, జూలై 7: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈనెల 24న నిర్వహించనున్న ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. బుధవారం ప్రగతి భవన్లో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ చేతులమీదుగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమ గోడప్రతులను ఎమ్మెల్యే అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ఒకే రోజు ఒక్క గంటలో మూడు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించి, హరిత తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
దళితుల ఆర్థికాభివృద్ధికే ‘సాధికారత’
దళితుల ఆర్థికాభివృద్ధి కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత సాధికారత పథకం రూపొందించారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీ హాల్లో ఎస్సీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. రైతుల మాదిరిగా దళితులకు బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే గ్రౌండింగ్ అయిన 2017, 2018, 2019 సంవత్సరాలకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ రుణాలను ఇవ్వాలని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రతి మండలానికి 20 మొబైల్ టిఫిన్ సెంటర్ల యూనిట్లు కేటాయించాలని, ఇండస్ట్రియల్ కార్పొరేషన్లో దళితులకు ఇస్తున్న 35శాతం సబ్సిడీని 50 శాతానికి పెంచాలని కోరారు.