రామగిరి, జూన్ 22 : ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ నెల 25 నుంచి విధులకు హాజరుకానున్నారు. రెండునెలల విరామం తర్వాత టీచర్లు పాఠశాలల బాట పట్టనున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉమ్మడి జిల్లాలోని 11,971మంది ఉపాధ్యాయులు శుక్రవారం విధులకు హాజరుకానున్నారు. ఆ దిశగా ఆయా పాఠశాలలను క్లోరినేషన్ చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు. జూలై 1నుంచి 8,9,10 తరగతుల విద్యార్థులు పాఠశాలలకు వెళ్లనున్నట్లు సమాచారం.
ఉమ్మడి జిల్లాలో 4,226 పాఠశాలలు..
నల్లగొండ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 4,226 ప్రభుత్వ, జడ్పీ, మోడల్, కేజీబీవీ, గురుకులాలు, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో 11,971మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 5,388, సూర్యాపేట జిల్లాలో 3,680, యాదాద్రిభువనగిరి జిల్లాలో 2,903 మంది ఉన్నారు. వీరు కాకుండా గురుకులాలల్లో మరో 2వేల మంది ఉంటారు.
విధిగా హాజరుకావాలి : డీఈఓ
నల్లగొండ, సూర్యాపేట జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, జడ్పీ, మోడల్, కేజీబీవీ, ఎయిడెడ్, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు విధిగా ఈ నెల 25నుంచి విధులకు హాజరుకావాలని డీఈఓ బి.భిక్షపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హాజరుకాని పక్షంలో వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.