మియామి: అమెరికాకు చెందిన కొత్త, అత్యాధునిక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ యుద్ధానికి సిద్ధంగా ఉందో తెలుసుకోవడానికి యూఎస్ నేవీ ఓ భారీ పేలుడుతో టెస్ట్ చేసింది. యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్గా పిలుస్తున్న ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్కు అత్యంత సమీపంలో ఈ పేలుడు జరిపారు. ఫుల్ షిప్ షాక్ ట్రయల్స్ పేరుతో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఇది మొదటి పేలుడు. నీళ్లలో భారీ పేలుడుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి.
18144 కిలోల పేలుడు పదార్థాలతో ఈ పేలుడు జరిపినట్లు యూఎస్ మీడియా వెల్లడించింది. ఫ్లోరిడా తీరంలో అట్లాంటిక్ సముద్రంలో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పేలుడు 3.9 తీవ్రత గల భూకంపంగా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. కొత్త యుద్ధ నౌకలపై అమెరికన్ నేవీ ఇలాంటి షాక్ ట్రయల్స్ నిర్వహిస్తూనే ఉంటుంది. ట్రయల్స్ ముగిసిన తర్వాత యుద్ధనౌకకు మరోసారి కొన్ని మరమ్మతులు నిర్వహిస్తారు.