లక్నో: భారీ వర్షాలకు నిండుగా ప్రవహిస్తున్న కాలువలో మునిగిపోతున్న ఒక వ్యక్తిని ఒక పోలీస్ అధికారి కాపాడారు. ఉత్తరప్రదేశ్ అలీఘడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎస్ఐ ఆశిష్ కుమార్ విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలో ఒక వ్యక్తి కాలువలో పడిపోయాడు. అతడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ మునిగిపోతుండగా పలువురు చూస్తూ ఉన్నారు కానీ ఎవరూ కూడా కాపాడే ధైర్యం చేయలేదు. ఇంతలో అక్కడకు వచ్చిన ఎస్ఐ ఆశిష్ కుమార్ వెంటనే కాలువలోకి దూకి మునిగిపోతున్న వ్యక్తి చేయి పట్టుకున్నారు. ఒక్క చేతితో ఈదుతూ అతడ్ని ఒడ్డుకు చేర్చారు.
ఎస్ఐ ఆశిష్ చూపిన ధైర్య సాహసాలను అలీగఢ్ పోలీస్ చీఫ్ కలానిధి నైతని కొనియాడారు. ఆశిష్ చిన్నప్పుడు ఈత నేర్చుకున్నారని, ఏండ్ల పాటు ఈదక పోయినా మునిగిపోతున్న వ్యక్తిని కాపాడాలన్న ఉద్దేశంతో వెంటనే కాలువలోకి దూకి పోలీస్ అంకిత భావాన్ని ప్రదర్శించారని ప్రశంసించారు. ఎస్ఐ ఆశిష్ కుమార్కు రూ.25,000 రివార్డు కూడా ప్రకటించారు.