మెహిదీపట్నం, జూన్ 18 : జియో ఇంటర్నెట్ కోసం డబ్బులు కట్టి వాడుకున్న తర్వాత డిపాజిట్ను వెనక్కి తీసుకోవడానికి కస్టమర్కేర్ను సంప్రదించినందుకు ఓ యువకుడు రూ.30 వేలు పోగొట్టుకున్న సంఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగు చూసింది. అదనపు ఇన్స్పెక్టర్ లంకాల భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… లంగర్హౌస్ ఫ్లోర్ మిల్ సమీపంలోని ఇందిరానగర్కు చెందిన షేక్ ముస్తఫా బంజారాహిల్స్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మే 1న జియో కంపెనీలో ఫైబర్నెట్ ప్యాకేజీ తీసుకున్నాడు. నెల రోజులు వాడిన తర్వాత జియో ఫైబర్నెట్ను కంపెనీకి తిరిగి ఇచ్చేసి తాను డిపాజిట్ చేసిన డబ్బులు తీసుకోవడానికి కస్టమర్కేర్కు ఫోన్ చేశాడు.
అక్కడ వారు స్పందించక పోవడంతో అధికారిక రిలయన్స్ ట్విట్టర్లో మీ సేవలు బాగా లేవని, తాను డిపాజిట్ చేసిన రూ.2500 తిరిగి చెల్లించాలని ఫిర్యాదు చేశాడు. దీనిని గుర్తించిన సైబర్నేరగాళ్లు తాము రిలయన్స్ కస్టమర్ కేర్నుంచి మాట్లాడుతున్నామని, టీమ్ వీవర్ ద్వారా ఫైబర్నెట్ను రూ.10తో రీచార్జి చేసుకోవాలని సూచించారు. అక్కడ సాంకేతిక లోపంతో రీచార్జి కాకపోవడంతో తాము రీచార్జి చేస్తామని షేక్ముస్తఫా వివరాలను టీమ్ వీవర్లో తీసుకున్నారు. అతడి వివరాలను తీసుకున్న సైబర్ నేరగాళ్లు ముస్తఫా ఖాతాలోని రూ.30వేలు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు లంగర్హౌస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.