న్యూఢిల్లీ: చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విలయం సృష్టిస్తున్నది. మహమ్మారి వల్ల ఇప్పటివరకు 40 లక్షల మందికిపైగా మృత్యువాతపడ్డారు. ఈమేరకు రాయ్టర్స్ అధ్యయం వెల్లడించింది. ఈ ప్రాణాంతక వ్యాధి 2019 డిసెంబర్లో చైనాలోని ఉహాన్లో వెలుగు చూసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రెండేండ్లు కావస్తున్నప్పటికీ వైరస్ ప్రభావం ఇంకా తగ్గడం లేదు. అనేక రూపాంతరాలు చెందుతూ లక్షల సంఖ్యలో జనాభాను పొట్టన పెట్టుకుంటున్నది. మొదటి 20 లక్షల మరణాలు నమోదవడానికి ఏడాది కాలం పడితే, మరో 20 లక్షల మరణాలకు కేవలం 166 రోజులు మాత్రమే పట్టిందని అధ్యయనం పేర్కొన్నది.
జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలోని కరోనా సెంటర్ గణాంకాల ప్రకారం అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా, మెక్సికో దేశాల్లో అత్యధిక కేసులు, మరణాలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం మరణాల్లో ఈ ఐదు దేశాల్లోనే 50 శాతం ఉన్నాయంటే మహమ్మారి ఎంతలా విలయం సృష్టించిందో అర్థంచేసుకోవచ్చు. ఇక పెరూ, హంగేరి, బోస్నియా, చెక్ రిపబ్లిక్, జిబ్రాల్టర్ వంటి చిన్న దేశాల్లో మరణాల రేటు అత్యధికంగా ఉందని వెల్లడించింది.
ఇక ఈ ఏడాది నుంచి మార్చిలో లాటిన్ అమెరికాలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రికార్డవుతున్న రోజువారీ కేసుల్లో ప్రతి వందలో 43 మంది బాధితులు ఇక్కడే ఉన్నారని తెలిపింది. అదేవిధంగా రోజువారీ మరణాల్లో అత్యధికంగా భారత్, బ్రెజిల్లోనే ఉన్నాయని వెల్లడించింది. కాగా, కరోనాతో చనిపోతున్న ప్రతి ముగ్గురిలో ఒకరు భారత్కు చెందినవారేనని అధ్యయనంలో తేలింది. అయితే దేశాలు కరోనా మరణాలకు తక్కువగా చూపెడుతున్నాయని, మరణాల సంఖ్య భారీగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆరోపిస్తుండటం గమనార్హం.