కొవిడ్ బడిని ఇంటికి తెచ్చింది. పాఠాలను అరచేతిలోని సెల్ఫోన్లో వినిపిస్తున్నది. కానీ, ఫోన్ లేని పిల్లలూ, ఉన్నా అందులో ఇంటర్నెట్ సదుపాయం లేని విద్యార్థుల పరిస్థితి ఏమిటి? విద్య వానకాలం కన్నా దుర్భరంగా మారిన ఈరోజుల్లో చదువుల మాటేమిటి? భవిష్యత్తు సంగతేంటి? రెండు గ్రామాల్లో ఈ సమస్యకు వినూత్న పరిష్కారం కనిపిస్తున్నది.చిన్నారులు బడికి దూరమైనా, చదువులకు దగ్గరయ్యేలా వీధి గోడలనే బ్లాక్బోర్డ్గా మార్చేశారు.
మహారాష్ట్రలోని పుణెనుంచి 50 కి.మీ. దూరంలో ఉంటుంది మాల్వాడి. అంతర్జాతీయ నగరం చెంతనే ఉన్నా ఇదో కుగ్రామం. కొండలమధ్య చిన్న కోనలా ఉంటుంది. ఇక్కడి పాఠశాలలో 57 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఏడాదిగా బడి తెరుచుకుంది లేదు. పోనీ, ఆన్లైన్లో పాఠాలు విందామంటే, అందరి దగ్గరా మొబైల్ ఫోన్లు లేవు. కొందరివద్ద ఉన్నా ఆ ఊళ్లో సాధారణ సిగ్నల్స్ రావడమే గొప్ప. ఇక 3జీ, 4జీ తరంగాల ముచ్చటే లేదు. దీంతో మాల్వాడి పిల్లల చదువు అటకెక్కింది. వీధుల్లో చేరి ఆడుకోవడమే వ్యాపకంగా మారింది. చదువులకు దూరమై కండ్లముందే దారి తప్పుతున్న చిన్నారులను చూసి పెద్దలు బాధ పడేవారు. నయానో భయానో చదువమని పోరేవారు. పెద్దలు ఇలా పొలం బాట పట్టగానే, పిల్లలు వీధుల్లోకి వచ్చేసేవారు. క్రమంగా వ్యసనాలకూ అలవాటు పడ్డారు.
ఓ యువకుడి చొరవ
విద్యార్థుల పరిస్థితిని గమనించిన రాజేశ్ బోడ్కే అనే యువకుడు దీనికి ఓ పరిష్కారం కనుగొన్నాడు. గ్రామంలో వీధి వీధినీ, ఇంటింటినీ తన ప్రయోగానికి వేదికగా మార్చాడు. ప్రతి గోడపై రంగులు కుమ్మరించాడు. ఓ గోడపై అక్షరాలు, ఇంకో గోడపై అంకెలు, మరో గోడపై శరీరభాగాలు.. ఇలా వందకుపైగా గోడలపై పాఠాలను అందమైన బొమ్మలతో కలిపి వేయించాడు రాజేశ్. ఇందుకోసం సొంతంగా లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేశాడు. దాంతో ఆ ఊరి తల్లిదండ్రులకు ఏ బెంగా లేకుండా పోయింది. అక్కడి పిల్లలు ఏ వీధికి వెళ్లినా ఏదో ఒక పాఠం వారి కండ్లముందు ఉంటున్నది. ఆటలాడుకుంటూ ఆ పక్కనే గోడపై ఉన్న ఎక్కాలు బట్టీయం పడుతున్నారు. పాటలు పాడుకుంటూ ఎదురుగా గోడలమీది మానవ శరీరావయవాల జాబితాను రాగాలు తీస్తూ చదువుతున్నారు. ఆంగ్లపదాలకు అర్థాలు తెలుసుకుంటున్నారు. సైన్స్ మూలకాల పేర్లు కాపీల్లో రాసుకుంటున్నారు. వారికి కావాల్సిన వివరాలున్న గోడ దగ్గరకు వెళ్లి ఎంచక్కా చదువుకుంటున్నారు. ఇలా గోడ బడి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిస్తున్నది.
గూడెం గోడలపైనా..
పట్నంలో పిల్లలకు ఆన్లైన్ తరగతులు అందుబాటులో ఉంటాయి. మరి, మారుమూల అటవీ ప్రాంతంలోని ఆదివాసీ గూడేల్లోని చిన్నారుల పరిస్థితి ఏంటి? ఇదే ఆలోచన వచ్చింది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి సబ్ ఇన్స్పెక్టర్ రామారావుకు. అడవి బిడ్డలు చదువుకు దూరం కావొద్దని భావించారాయన. గూడేల్లో చౌరస్తా బడికి శ్రీకారం చుట్టారు. మంగి ప్రాంతంలో మారుమూల గ్రామాలైన గోపర, పాతగూడ, గోయనా, ముల్కల మంద, మొర్రిగూడ, రోమ్పల్లి, పంగిడి మాదార, మెస్రంగూడ, తలండి పంచాయతీల పరిధిలోని 40 ఆదివాసీ గూడేల్లో చౌరస్తా బడులను ఏర్పాటు చేశారు. కూడళ్ల వద్ద ఉండే ఇండ్ల గోడలపై అక్షరాలు రాయించారు. తెలుగు అక్షరమాల, గుణింతాలు, అంకెలు, ఎక్కాలు, కూడికలు, తీసివేతలు రంగులతో వేయించారు. చిన్నారులు రోజూ ఆ గోడల నీడన వాటిని చదువుతున్నారు. స్థానికంగా ఉండే యువకులు పిల్లలకు పాఠాలు బోధిస్తుండటం విశేషం. ఎస్ఐ రామారావు ఏర్పాటు చేసిన ఈ గోడ బడులకు తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తుంది. తమ పిల్లలను రోజూ చదువు నేర్చుకునేందుకు పంపిస్తున్నారు. పోలీసు అధికారి ప్రయత్నాన్నీ ప్రశంసిస్తున్నారు.