న్యూఢిల్లీ : కరోనా తాజా వేరియంట్ల నుంచి రక్షణ కల్పించేందుకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య విరామం తగ్గించాలనే వాదనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ లో ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పు ఉండదని, శాస్త్రవేత్తలు, నిపుణుల కమిటీ సూచనల మేరకు అవసరమైన మార్పులు చేపడతామని స్పష్టం చేసింది. కొవిడ్-19 వ్యాక్సినేషన్ పై ఏర్పాటైన నెగ్ వాక్ వచ్చే వారంలో జరిగే సమావేశంలో శాస్త్రీయ ఆధారాలపై చర్చించి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక వ్యాక్సిన్ డోసుల మధ్య విరామంపై ఆందోళన అవసరం లేదని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామం తగ్గించడాన్ని సరైన శాస్త్రీయ ఆధారాలతోనే చేపట్టాలని స్పష్టం చేశారు. కొత్త వేరియంట్ల నుంచి ప్రజలకు రక్షణ కల్పించడం, ఇంతవరకూ వ్యాక్సిన్ సింగిల్ డోస్ తీసుకోని వారికి వ్యాక్సినేషన్ వంటి అంశాల పట్ల సమతూకం పాటించాల్సి ఉందని చెప్పారు.