హైదరాబాద్: పెట్రోల్ రేట్లు మండిపోతున్నాయి. దేశీయ చమురు కంపెనీలు ఎడాపెడా ధరలను పెంచుతూ పోతున్నాయి. ఇప్పటికే కరోనాతో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న జనాలు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. రెండు రోజుల విరామం తర్వాత పెట్రో కంపెనీలు పెట్రోల్పై 29 పైసలు, డీజిల్పై 28 పైసల చొప్పున పెంచాయి. దీంతో రాష్ట్రంలోని జగిత్యాలలో పెట్రోల్ ధర వంద మార్కును దాటింది. ప్రస్తుతం జగిత్యాలలో లీటర్ పెట్రోల్ రూ.100.34, డిజిల్ రూ.95.23గా ఉన్నాయి. ఇక హైదరాబాద్లో పెట్రోల్ రూ.99.61, డీజిల్ రూ.94.56కు చేరాయి.
ఈ నెలలో ఇప్పటి వరకు ఆరు సార్లు ఇంధన ధరలుపెరిగాయి. ఇక ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడిన తర్వాత అంటే మే 4 నుంచి ఇప్పటివరకు 23 సార్లు చమురు కంపెనీలు ధరలను పెంచాయి. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు పెట్రోల్ బంకులకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.
దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్ను దాటగా.. డీజిల్ సైతం రూ.100 వైపు పరుగులు పెడుతున్నది. దేశంలోనే అత్యధికంగా రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో లీటర్ పెట్రోల్ రూ.106, డీజిల్ రూ.99గా ఉన్నాయి.