హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): సూర్యుని చుట్టూ ఇంద్రధనుస్సులా ఓ వలయం (వరద గుడి) ఏర్పడిన అద్భుత దృశ్యం బుధవారం రాష్ట్రంలో పలుజిల్లాల్లో కొన్ని గంటలపాటు కనువిందు చేసింది. హైదరాబాద్లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ దృశ్యం స్పష్టంగా కనిపించింది. మంగళవారం రాత్రంతా ఉరుములు, మెరుపులతో భారీవర్షం కురిసింది. వర్షం కారణంగా వాతావరణంలో నీటి బిందువులు ఉంటాయని, అవి స్ఫటికాలుగా మారినప్పుడు వాటి గుండా సూర్యుడి కాంతి ప్రసరించినప్పుడు విక్షేపం చెంది ఇంద్రధనస్సులా కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా ఏర్పడిన వలయాలను సన్హాలో, 22 డిగ్రీ హాలోస్ అని పిలుస్తారు. కొన్ని సమయాల్లో ఇది 46 డిగ్రీల వ్యత్యాసాన్ని కలిగి ఉన్నప్పుడు మరోరకమైన ఇంద్రధనుస్సులా కనిపిస్తుంది. సూర్యుని కాంతి షట్కోణ ఆకారంలో గల ఘనీభవించిన నీటి స్ఫటికాలపైపడి వక్రీభవనం చెందినప్పుడు కూడా రంగురంగులతో కూడిన వలయాలు ఏర్పడుతుండటం సహజమని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా పేర్కొన్నది. ఈ అద్భుతాన్ని నగరవాసులు సెల్ఫోన్లనో బంధించి సోషల్మీడియాలో షేర్ చేయడంతో ఈ చిత్రాలు ట్రెండింగ్లో నిలిచాయి.