హన్మకొండ చౌరస్తా, జూన్ 2: నకిలీ కరెన్సీ ముద్రించి మార్కెట్లో చెలామణి చేస్తున్న దంపతులను వరంగల్ పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి సుమారు రూ.10.09 లక్షల నకిలీ కరెన్సీతోపాటు కలర్ ప్రింటర్, బాండ్ పేపర్లు, కట్టర్ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి వెల్లడించిన వివరాల ప్రకారం.. కాశీబుగ్గ తిలక్రోడ్ ప్రాంతానికి చెందిన వంగరి రమేశ్-సరస్వతి దంపతులు. రమేశ్ చికెన్ సెంటర్ నడుపుతుండగా సరస్వతి ఫ్యాన్సీ దుకాణంతోపాటు మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్నది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతోపాటు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో దంపతులు నకిలీ నోట్ల ముద్రణకు ప్రణాళిక రూపొందించుకొన్నారు. ఇందుకోసం అవసరమైన స్కానర్తో కూడిన కలర్ ప్రింటర్, కరెన్సీకి అవసరమైన బాండ్ పేపర్లను కొనుగోలు చేసి మూడు నెలలుగా రూ.2 వేలు, రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నకిలీ నోట్లను ముద్రించారు. ఎవరికీ అనుమానం రాకుండా వాటిని హన్మకొండ, వరంగల్లో రద్దీగా ఉండే దుకాణాల్లో చెలామణి చేసేవారు. కొద్దిరోజులుగా వరంగల్ ట్రైసిటీ పరిధిలోని దుకాణాల్లో నకిలీ నోట్లు చలామణి అవుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఉదయం నోట్లను ముద్రిస్తున్న ఇంటిపై ఆకస్మికంగా దాడి చేసి దంపతులను అదుపులోకి తీసుకున్నట్టు సీపీ వెల్లడించారు.