ఎదులాపురం,మే 23: ఎలాంటి కారణంగా లేకుండా అనవవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ ఎం రాజేశ్ చంద్ర తెలిపారు. పట్టణంలో ప్రధాన కూడళ్ల వద్ద ఆదివాకం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రతి చెక్పోస్ట్ వద్ద అంబులెన్స్, ఇతర అత్యవసర వాహనాలు వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మాస్క్లు ధరించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్న 172 మందికి జరిమానా విధించామని, భౌతిక దూరం పాటించచని 53 మందిపై, లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన 811 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వినోద్ కుమార్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీటీసీ డీఎస్పీ కే ఉమామహేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ జీ మల్లేశ్, పట్టణ సీఐ పోతారం శ్రీనివాస్, ఎస్ రామకృష్ణ, రాం నరసింహారెడ్డి, పురుషోతమాచారి, ఎస్ఐలు పాల్గొన్నారు.
నిర్దేంచిన సమయంలోనే గూడ్స్ వాహనాలకు అనుమతి
ప్రతి రోజూ రాత్రి 9 నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు సరుకులు రవాణా చేసే గూడ్స్ వాహనాలకు అనుమతి ఉందని, ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని, లాక్డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని పేర్కొన్నారు. అత్యవసర సేవలైన ఆక్సిజన్, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు, క్యారింగ్ వాహనాలు, నీళ్ల ట్యాంకర్లకు అనుమతి ఉంటుందని వివరించారు. సరుకులు తరలించే గూడ్స్ వాహన యజమానులు నిర్దేశించిన సమయాల్లోనే పట్టణంలో ప్రవేశించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సడలింపు సమయంలో పనులు పూర్తిచేసుకోవాలి
ఆసిఫాబాద్, మే 23 : సడలింపు సమయంలోనే ప్రజలు తమ పనులను పూర్తి చేసుకోవాలని ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర కోరారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును ఆదివారం ఆయన సందర్శించారు. నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాల లోడింగ్,అన్లోడింగ్ను రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల్లోపు ముగించేలా చర్యలు తీసుకోవాలని సీఐ అశోక్కు సూచించారు. మధ్యాహ్నం వేళలో లోడింగ్, అన్ లోడింగ్ చేస్తే వాహనలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద అధివారం ఏఆర్ ఏఎస్పీ సురేశ్ వాహనాలను తనిఖీ చేశారు. ఆర్ఐ అడ్మిన్ శేఖర్బాబు,ఎస్సైలు వెంకటేశ్,రాజేశ్వర్ తదితరులున్నారు.
చెక్పోస్ట్ను సందర్శించిన ఎస్పీ
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, మే 23 : వాంకిడి మండలంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ను ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర ఆదివారం సందర్శించారు. క్షేత్రస్థాయిలో విధుల నిర్వహణకు సంబంధించి అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. ఈ పాస్ లేని వాహానాను అనుమతించవద్దని, సీజ్ చేయాలని సూచించారు. ఆయన వెంట సీఐ సుధకార్, ఎస్ఐ రమేశ్ ఉన్నారు.
కరోనా కట్టడికి సహకరించాలి
గర్మిళ్ల, మే 23 : కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు ప్రతి ఒక్కరు సహకరించాలని మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్ రెడ్డి కోరారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. పట్టణంలోని మార్కెట్ ఏరియాలో కాలినడకన తిరుగుతూ దుకాణాలను 10 గంటల్లోపు మూసివేయించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. డీసీపీ వెంట పట్టణ సీఐ ముత్తి లింగయ్య, ఎస్సైలు ప్రవీణ్కుమార్, దేవయ్య, కిరణ్కుమార్, సిబ్బంది ఉన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
సీసీసీ నస్పూర్, మే 23 : ఎవరైనా లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. సీసీసీ నస్పూర్లో చెక్పోస్ట్ను ఆయన పరిశీలించారు. లాక్డౌన్ అమలుతీరును సీఐ కుమారస్వామి, ఎస్ఐ శ్రీనివాస్ను అడిగితెలుసుకున్నారు. కొద్దిసేపు వాహనాలను తనిఖీ చేశారు. లాక్డౌన్పై అవగాహన కల్పించడానికి ఏసీపీ అఖిల్ మహాజన్ సాయంత్రం బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రధాన రహదారులపై మోటార్సైకిల్ ర్యాలీ చేపట్టారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.