వాషింగ్టన్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనాలో జరిగే శీతాకాల ఓలింపిక్స్ను బహిష్కరించాలని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పిలుపునిచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘనకుగానూ చైనా ఒలింపిక్స్ను దౌత్యపరంగా వెలివేయాలని అన్నారు. ఆ ఒలింపిక్స్కు ప్రపంచనేతలు ఎవరూ హాజరు కావద్దని కూడా పెలోసీ అన్నారు. అయినా వారు వెళితే నైతిక బలాన్ని కోల్పోయినట్టు అవుతుందని అన్నారు. చైనా ఓలింపిక్స్ను బహిష్కరించడమో లేక ఓలింపిక్స్ను అక్కడి నుంచి వేరేచోటికి మార్చడమో చేయాలని అమెరికా చట్టసభల ప్రతినిధులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఉయ్ఘుర్లను, ఇతర మైనారిటీలను చైనా ఊచకోత కోస్తున్నదని, దీనిపై అమెరికా కార్పోరేట్ల మౌనం చైనాను ప్రోత్సహించేదిగా ఉందని వారు అంటున్నారు. కాంగ్రెస్ ద్విపక్ష కమిటి ముందు హాజరైన పెలోసి కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. కీలకస్థానంలో ఉన్న పెలోసీ అభిప్రాయానికి చాలా విలువ ఉంటుంది. పైగా ఇప్పుడున్నది డెమొక్రాటిక్ ప్రభుత్వమే కనుక బహిష్కరణ జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు.