ముంబై : తౌక్టే తుఫాన్తో ముంబై తీరంలో ఉన్న నాలుగు బార్జ్లు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అయితే P305 బార్జ్లో ఉన్న వారిని యుద్ధ నౌక ఐఎన్ఎస్ కొచ్చి రక్షించింది. ఇండియన్ నేవీ ఇప్పటి వరకు సుమారు 184 మందిని సురక్షితంగా తీరానికి తీసుకువచ్చింది. ఇంకా కొన్ని ఓడల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ముంబై తీరానికి వచ్చిన అమిత్ కుమార్ కుశ్వా .. తుఫాన్ సమయంలో ఎదుర్కొన్న భయానక పరిస్థితుల్ని వివరించారు. P305 బార్జ్లో ఉన్నవారంతా .. ఓఎన్జీసీ కోసం పనిచేస్తున్నారు. అయితే తౌక్టే ధాటికి P305 బార్జ్ మునిగిపోయింది. ఆ సమయంలో ప్రాణాలు దక్కించుకునేందుకు నదిలోకి దూకినట్లు అమిత్ కుమార్ తెలిపారు. సుమారు 11 గంటల పాటు సముద్రంలోనే రెస్కూ సిబ్బంది కోసం ఎదురుచూసినట్లు అతను తెలిపాడు. అయితే భారతీయ నౌకాదళ సిబ్బంది తనను రక్షించినట్లుచెప్పాడు. ఐఎన్ఎస్ కొచ్చిలో ముంబై తీరానికి చేరుకున్న P305 బార్జ్ సిబ్బంది.. భావోద్వేగాలకు గురయ్యారు.
ఇప్పటి వరకు 184 మందిని రక్షించామని, ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని, యుద్ధనౌకలు, విమానాలతో రెస్కూ చేస్తున్నామని ఐఎన్ఎస్ కొచ్చి కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ సచిన్ సీక్వెరియా తెలిపారు. P305 బార్జ్ ఉన్న ప్రాంతంలో ఇంక ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో రెస్క్యూ చేస్తున్నామన్నారు. చాలా ఆశావాహభావంతో ఆపరేషన్ జరుగుతోందన్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మెరుగుపడ్డాయని తెలిపాడు. ఐఎన్ఎస్ కొచ్చిలో 125 మందిని వెనక్కి తీసుకువచ్చినట్లు కెప్టెన్ సచిన్ తెలిపాడు. ముంబై తీరానికి 40 మైళ్ల దూరంలో P305 బార్జ్ ఇబ్బందుల్లో ఉన్నట్లు గ్రహించామన్నాడు. చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఆపరేషన్ చేపట్టినట్లు ఆ ఆఫీసర్ వెల్లడించాడు.